రాజధాని కోసం ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి- పోలీసులకు గాయాలు
షిల్లాంగ్: మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కార్యాలయంపై భారీ సంఖ్యలో నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అయిదుమంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దాడి సమయంలో సంగ్మా కార్యాలయంలోనే ఉన్నారు. ఆయన క్షేమంగా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మేఘాలయా రాజధానిగా షిల్లాంగ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తురా పట్టణాన్ని శీతాకాల రాజధానిగా ప్రకటించాలంటూ కొంతకాలంగా పౌర సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తోన్నాయి. వెస్ట్ గ్యారో హిల్స్ జిల్లా కేంద్రంగా ఉంటోంది తురా టౌన్. రాజధాని షిల్లాంగ్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తురా టౌన్ను శీతాకాల రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది. గ్యారో పీపుల్స్ ఫోరం నిరసన దీక్షలను చేపట్టింది. తురాలో రిలే ఆమరణ నిరాహర దీక్షలను కొనసాగిస్తోంది. ఏసీహెచ్ఐకే, జీహెచ్ఎస్ఎంసీ.. వంటి పౌర సంఘాలు ఈ ఉద్యమానికి నాయకత్వాన్ని వహిస్తోన్నాయి.
నిరసనల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోన్న నేపథ్యంలో ఇవ్వాళ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. తురా టౌన్కు చేరుకున్నారు. స్థానిక కార్యాలయంలో ఆయా పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే వందలాది మంది ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడికి దిగారు. మూకుమ్మడిగా కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో భద్రత సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. దాడులు- ప్రతిదాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అయిదుమంది భద్రత సిబ్బంది, పోలీసులు గాయపడ్డారు. ఆ సమయంలో కాన్రాడ్ సంగ్మా.. ఆ కార్యాలయంలోనే ఉన్నారు. కార్యాలయానికి దారి తీసే అన్ని రోడ్డులనూ నిరసనకారులు మూసివేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు.












Click it and Unblock the Notifications