మోడీ 2.O క్యాబినెట్ విస్తరణ రేపే : చరిత్ర సృష్టించేలా విద్యావంతులైన యువ నాయకులకు, మహిళలకు పెద్ద పీట !!
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఈనెల 8వ తేదీ గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు భావించినా, రేపు సాయంత్రమే క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం ఆరు గంటలకు క్యాబినెట్ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో భారత దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని అతి పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
యువనాయకులకు మోడీ క్యాబినెట్ లో స్థానం
ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో యువ నాయకులకు పెద్దపీట వేయనున్నట్లుగా తెలుస్తుంది. బాగా విద్యావంతులైన నాయకులు "పిహెచ్డిలు, ఎంబీఏలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు విభిన్న రంగాలలో నిపుణులతో యువ నాయకులకు స్థానం కల్పించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈసారి క్యాబినెట్ విస్తరణపై దృష్టి పెట్టిన మోడీ సర్కార్ అందులో భాగంగా ప్రతి రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.
బాగా చదువుకున్న వారికి యువకులకు మంత్రులుగా బాధ్యత
మొత్తంమీద 25 మంది యువ నాయకులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో అధికంగా ఓబిసి నాయకులకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గా విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఎక్కువ మంది మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు గా సమాచారం. పరిపాలనా అనుభవం ఉన్నవారికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వబడుతుందని పీఎం మోడీ కొత్త క్యాబినెట్ మోడీ 2.O కేబినెట్ గా ప్రత్యేకతను సంతరించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పలువురు .. జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్ తదితరులు
జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) యొక్క పశుపతి పరాస్, నారాయణ్ రాణే మరియు వరుణ్ గాంధీలు మంత్రి వర్గ జాబితాలో ఉన్నారు.2019లో మోడీ రెండవ దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జరుగనున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇది కాబట్టి ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి వర్గ విస్తరణకు ముందు ప్రధాని మోడీ అన్ని శాఖల మంత్రుల పనితీరుపై సమీక్ష జరిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో కీలకంగా పని చేసిన మంత్రులు ఎవరు, పలు విమర్శలను ఎదుర్కొన్న మంత్రులు ఎవరు అన్న దానిపై కూడా ఆయన చర్చించారు.
రానున్న ఎన్నికల నేపధ్యంలో క్యాబినెట్ విస్తరణ
ఇక మంత్రి వర్గంలో నిబంధనల ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో 81 మంది మంత్రులు ఉండొచ్చు అయితే ప్రస్తుతం క్యాబినెట్ 53 మంది మాత్రమే ఉన్నారు ఇంకా ఇరవై ఎనిమిది మందిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణ పైనే ప్రధానంగా కేంద్రీకృతమైంది.