రోబోల్లా వద్దు, కుటుంబంతోను గడపండి: అధికారులతో మోడీ
న్యూఢిల్లీ: రోబోల మాదిరి జీవించవద్దని, కుటుంబంతోను తగినత సమయం గడపాలని కేంద్ర ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మీరంతా కాలాన్ని వినియోగించుకోవడంలో చాలా మంచివారని, కుటుంబాల కోసం కూడా మీరు తగినంత సమయం కేటాయించగలుగుతున్నారా, దయచేసి దాని కోసం కూడా ఆలోచించాలని, మీ జీవితాలు రోబోల మాదిరిగా తయారు అయ్యాయో లేదో ప్రశ్నించుకోవాలని మోడీ అన్నారు.
రోబోల్లా తయారైతే ఆ ప్రభావం ప్రభుత్వం పైన, వ్యవస్థ పైన పడుతుందన్నారు. రోబోల మాదిరిగా ఉండవద్దన్నారు. మంగళవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన 9వ సివిల్ సర్వీసుల దినోత్సవంలో ప్రధాని మాట్లాడారు. బ్యూరోక్రసీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం అనివార్యమైన అవసరమని ప్రధాని మోడీ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైన రాజకీయ జోక్యం అవసరమెంతో ఉందని స్పష్టం చేశారు.
అయితే, ఈ రాజకీయ ప్రమేయాన్ని సుపరిపాలనకు అవరోధంగా ఎంతమాత్రం పరిగణించడానికి వీల్లేదన్నారు. రాజకీయ ప్రమేయానికి, రాజకీయ జోక్యానికి మధ్య ఎంతో తేడా వుందని ఉందన్నారు. రాజకీయ ప్రమేయం వల్ల వ్యవస్థ నాశనమవుతుందని, కానీ రాజకీయ జోక్యం వల్ల సుపరిపాలన మరింత శక్తివంతమవుతుందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యూరోక్రసీలో రాజకీయ ప్రమేయం అన్నది అనివార్యమని, ఈ రెండూ సమతూకంలో ముందుకు సాగితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. చట్టసభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి, ప్రజాస్వామ్యంలో రాజకీయ జోక్యం అవసరమని, కానీ రాజకీయ ప్రమేయం వల్ల వ్యవస్థ నాశనమవుతుందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యూరోక్రసీ వ్యవస్థ నుంచి అవరోధాలు, అసాధ్యం అన్న మాటలను తొలగించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. త్వరలోనే మొబైల్ గవర్నెన్స్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయనున్న తరుణంలో బ్యూరోక్రసీలో సంస్కరణలను వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. ఈ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని మోడీ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి సామాజిక, ఆర్థిక సమగ్రత ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.