బీజేపీ అధికారంలోకి వస్తుందంటేనే విపక్షాలకు చెమటలు పడుతున్నాయి ఎందుకో తెలుసా..?
బీహార్ : వారసత్వ రాజకీయాలపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. తను మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్భంధన్ నాయకుల అవినీతి బాగోతాన్ని ఎక్కడ బయటపెడుతానో అని భయపడుతున్నారని మోడీ అన్నారు. బీహార్లోని భగల్పూర్లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ... తమ ప్రభుత్వం దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జవాన్లకు పూర్తి అధికారాలు ఇస్తే విపక్షాలు తప్పుబడుతున్నాయని ధ్వజమెత్తారు. జవాన్లకు పూర్తి అధికారాలు ఇస్తేనే ఉగ్రవాదులను, నక్సలైట్లను ఏరిపారేస్తారని మోడీ అన్నారు.
Recommended Video
బయటకు మాత్రం జవాన్ల విషయం గురించి ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్న విపక్షపార్టీల నేతలు లోపల మరోవిషయం గురించి భయపడుతున్నారని చెప్పిన మోడీ... వారు చేసిన అవినీతిని బయటపెడుతానని ఆందోళన చెందుతున్నారన్నారు. రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పటిష్ట పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోడీ వెల్లడించారు. మోడీ అధికారంలోకి వస్తే ఇకపై దేశంలో ఎన్నికలు జరగవని అన్ని రాజ్యాంగ సంస్థలు తమ గుప్పిట్లోకి వెళతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మోడీ.
దేశానికి కాపలాదారుడిగా ఉన్న తను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ కోటాను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మోడీ. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే బీహార్ అభివృద్ధి రెట్టింపు అవుతుందని అన్నారు.