మోదీ జపాన్ టూర్: బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది, మోదీ హయాంలో పట్టాలెక్కుతుందా ?
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ రాజధాని టోక్యో వెళ్లారు. ఆయన ప్రధానిగా పని చేస్తున్న ఎనిమిదేళ్ల కాలంలో జపాన్కు ఇది ఐదో పర్యటన.
భారతదేశంలో జపాన్ ప్రస్తావన రాగానే బుల్లెట్ ట్రైన్ గుర్తుకు వస్తుంది. కారణం, జపాన్ సహకారంతో భారత్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు అంకురార్పణ జరిగింది.
భారత ప్రజల బుల్లెట్ రైలు కలను సాకారం దిశగా అడుగులు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత్, జపాన్ ప్రధానమంత్రులు ఇద్దరూ పాల్గొన్నారు.
అదే ఏడాది రైల్వే శాఖ బుల్లెట్ ట్రైన్ గురించి పెద్ద ప్రకటన చేసింది. "ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు పనులను ఆగస్ట్ 15, 2022 నాటికి పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ప్రకటించింది. అయితే, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2017లో నీతి ఆయోగ్ చెప్పింది.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది?
2020 సంవత్సరంలో, ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ భారతదేశంలో పట్టాలపై నడుస్తున్న బుల్లెట్ రైలు మొదటి ఫొటోను కూడా విడుదల చేసింది. ఈ-5 సిరీస్కు చెందిన షింకన్సేన్ బుల్లెట్ రైలు భారత్కు వస్తుందని చెప్పారు.
2022 మేలో ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు వెళ్లేనాటికి 17 శాతం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ఆర్టీఐని ఉటంకిస్తూ ఆజ్ తక్ పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా, ఆజ్ తక్ ఈ సమాచారాన్ని ఫిబ్రవరి 1, 2022 న సంపాదించింది.
ఈ ఏడాది మే 20న బుల్లెట్ రైలు పురోగతిపై రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది.ఈ వీడియోలో మే 5 వరకు ప్రాజెక్ట్ పురోగతి నివేదికను ఏరియల్ షాట్ల ద్వారా చూపించారు.
వల్సాద్, నవ్సారి, సూరత్, భరూచ్, వదోదర, ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, సబర్మతిలో కొనసాగుతున్న పనుల పురోగతిని వీడియో చూపిస్తుంది. కానీ ముంబై వరకు నిర్మించే పార్ట్ గురించి ప్రస్తావించలేదు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) రూపొందించిన ఈ వీడియోలో గడువు ప్రస్తావన లేదు.
- జయనగర్-కుర్థా: భారత్-నేపాల్ దేశాలను కలిపే ఈ రైల్వే లైన్ ప్రత్యేకత ఏంటి?
- దక్షిణ మధ్య రైల్వే మూసివేస్తున్న 31 రైల్వే స్టేషన్లు ఇవే..
ప్రాజెక్ట్ ఆలస్యం
కానీ, ఈ వీడియోను చూస్తే 2023 సంవత్సరం వరకు ఈ రైలు ట్రాక్పై పరుగులు పెట్టడం కష్టమని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి, భూసేకరణలో జాప్యం దీని వెనక ఉన్న అసలు కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 2020 డిసెంబర్ వరకు మహారాష్ట్రలో భూసేకరణ పనులు పూర్తి కాలేదు. ''వచ్చే 4 నెలల్లో 80 శాతం భూమిని సేకరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది’’ అని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
అంటే, మహారాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ఏప్రిల్ 2021 వరకు గడువు విధించింది. మే వరకు మహారాష్ట్రలో 71%, గుజరాత్లో 98% భూసేకరణ పూర్తయింది. కానీ 2020లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనను బట్టి, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా ఇందులో సమస్యగా ఉందని అంచనా వేయవచ్చు.
ఫిబ్రవరి 2020లో 'సామ్నా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉద్ధవ్ ఠాక్రే బుల్లెట్ రైలు ప్రాజెక్టును 'తెల్ల ఏనుగు' అని అన్నారు. దీని వల్ల గుజరాత్కు ఎక్కువ, మహారాష్ట్రకు తక్కువ లాభం చేకూరుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
https://twitter.com/RailMinIndia/status/1527688639026671617
అప్పటి మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కంటే ముందు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉండేదని కూడా ఇక్కడ గమనించాలి. అప్పుడు కూడా భూసేకరణ సమస్య నిలిచిపోయింది. అదే సమయంలో, భారతదేశానికి బుల్లెట్ రైలును చూడాలనే కలను ప్రధాని మోడీ ఇంకా వదులుకోలేదన్నది కూడా నిజం.
ఈ ఏడాది ఫిబ్రవరి 18న వర్చువల్గా ముంబయి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "బుల్లెట్ రైలు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడమే మా ప్రాధాన్యత" అని అన్నారు.
- వాల్తేరు: అసలు ఈ పేరు ఎలా వచ్చింది... ఇప్పుడు కనుమరుగు అయిపోతుందా
- దిల్లీ రైల్వే స్టేషన్పై జీఎంఆర్, అదానీ సంస్థలు ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నాయి
బుల్లెట్ రైలు ప్రత్యేకతలు
జపాన్ బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబైని సూరత్, అహ్మదాబాద్లతో కలుపుతుంది. ఇందులో 12 స్టేషన్లు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కింద గుజరాత్లో 8 స్టేషన్లు, మహారాష్ట్రలో 4 స్టేషన్లు ఉంటాయి.
కేవలం 21 కి.మీ ట్రాక్ మాత్రమే భూమిపై ఉంటుంది. మిగిలిన ట్రాక్ అంతా ఎలివేట్ చేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 508 కి.మీ దూరాన్ని ప్రయాణించడానికి ప్రస్తుతం 8 గంటలు పడుతుంది. బుల్లెట్ రైలు మూడు గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తుంది.
https://twitter.com/ANI/status/1342973479373602816
ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ యాభై ఏళ్లకు 0.01% చొప్పున రూ. 88,000 కోట్ల రుణం ఇస్తోంది. బుల్లెట్ రైలును ప్రధాని మోదీ ప్రతిపాదించినప్పుడు అంటే 2014-15లో దాని మొత్తం వ్యయం రూ. 98,000 కోట్లుగా అంచనా వేశారు. 2020 నాటికి అది రూ.1,10,000 కోట్లకు పెరిగింది.
ఆలస్యం వల్ల ప్రభావం
ఆ తర్వాత కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్షీణత, ద్రవ్యోల్బణం, భారత దేశంపై దాని ప్రభావం - ఇవన్నీ కలిపితే, ఈ ఖర్చు మరింత పెరిగి ఉండేది. నిపుణులు చెబుతున్నది కూడా ఇదే.
గతంలో రైల్వే మంత్రిత్వ శాఖలో ట్రాఫిక్ మెంబర్గా ఉన్న శ్రీ ప్రకాశ్ బుల్లెట్ రైలు అంశంపై బీబీసీతో మాట్లాడారు. "కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్లు కనిపిస్తోంది, అయితే, కరోనా మహమ్మారి, భూ సేకరణలో జాప్యం కారణంగా, ప్రాజెక్ట్ ఆలస్యమైంది" అని ఆయన అన్నారు.
500 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉండే ఈ ప్రాజెక్ట్కి కనీసం ఐదేళ్లు పడుతుంది. అది కూడా భూసేకరణ తర్వాత. వచ్చే రెండేళ్లలో భూసేకరణ పనులు పూర్తయితే 2029-30 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు.
అయితే దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయం కూడా దాదాపు 60 శాతం పెరుగుతుంది. అంటే లక్షా 60-70 వేల కోట్ల మధ్య ఉంటుంది.ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాల దృష్ట్యా గుజరాత్లోని ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత రైలును ముందుగా ట్రాక్పై నడిపించే అవకాశం కూడా ఉంది.
రైల్వే శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం, సూరత్, బిలిమోరా మధ్య బుల్లెట్ రైలు ట్రయల్ 2026-27 నాటికి ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- మంకీపాక్స్: ఈ పాత వైరస్ కొత్తగా వ్యాపిస్తోంది.. మనం భయపడాలా? అవసరం లేదా?
- డ్రైవర్ మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేస్తాం: కాకినాడ జిల్లా ఎస్పీ
- 'మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)