మోడీ మంచి వక్త, ఓటమికి కారణమిదే, వారసత్వ రాజకీయాలపై రాహుల్ ఆసక్తికరం
వాషింగ్టన్: యూపిఏ ప్రభుత్వం ఉన్నంత కాలం కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం కొనసాగిందని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. కానీ, మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక కాశ్మీర్లో అశాంతి రాజ్యమేలుతోందని ఆయన చెప్పారు.
అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రసంగించారు. దేశంలో నెలకొన్న పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
దేశంలో ప్రజలను ఏకతాటి మీదికి తీసుకువచ్చేది అహింస మాత్రమేనని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. హింస వల్ల తీవ్ర నష్టమే తప్ప లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
మోడీ అనుసరిస్తున్న విధానాలపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు మోడీ అనుసరిస్తున్న విధానాల కారణంగానే కాశ్మీర్ అల్లకల్లోలంగా మారిందన్నారు రాహుల్గాంధీ.
కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాం
యూపిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చేసిన కృషిని రాహూల్గాంధీ ప్రస్తావించారు. మన్మోహన్సింగ్, చిదంబరం, జైరామ్రమేష్లు కాశ్మీర్లో శాంతిని నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన గుర్తుచేశారు. యూపిఏ అధికారంలో ఉన్నంతకాలం కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. 2013లో ఉగ్రవాదాన్ని నడ్డివిరిచిన సమయంలో తాను సంతోషంతో మన్మోహన్సింగ్ను హత్తుకొని మనం సాధించిన అతి పెద్ద విజయం ఇదేనని చెప్పిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.
బిజెపితో చేతులు కలిపి పిడిపి దెబ్బతింది
కాశ్మీర్లో అధికారంలో ఉన్న పిడిపి బిజెపితో చేతులు కలపడంతో ఆ రాష్ట్రంలో పిడిపి దెబ్బతినడం ప్రారంభమైందని రాహూల్గాంధీ అభిప్రాయపడ్డారు. మోడీ హయంలోనే కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని హింస కూడ చేలరేగుతోందని ఆయన ఆరోపించారు. పిడిపి యువతను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించి మంచి పనిచేసిందన్నారు.
మోడీ మంచి ఉపన్యాసకుడు
ప్రధానమంత్రి మోడీ మంచి వక్త అని రాహుల్గాంధీ ప్రశంసలతో ముంచెత్తారు. జనసందోహంలో ఉన్న మూడు నాలుగు గ్రూపులను సముదాయించేలా మాట్లాడడం మోడీకే చెల్లుతోందని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు.కానీ, పార్టీలో తనతోపాటు పనిచేసే సభ్యులతో మాత్రం ఆయన సంబంధం లేనట్టుగా ఉంటారని బిజెపికి చెందిన కొందరు నేతలు తనతో చెప్పారని ఆయన చెప్పారు.
అహింసపై దాడులు చేస్తున్నారు
దేశ ప్రజలందరిని ఐక్యం చేసింది అహింస మాత్రమేనని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే అహింస మీద కొందరు దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోపం, హింస వినాశనానికి దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1984 అల్లర్ల అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ న్యాయం కోసం పోరాటం చేసే వారికి తాను మద్దతుగా ఉంటానని చెప్పారు. తన తండ్రి రాజీవ్గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీలు కూడ హింసకే బలయ్యారని ఆయన చెప్పారు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని ఆయన చెప్పారు.
అహంకారం వల్లే ఓటమిపాలయ్యాం
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడ సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలను తీసుకొంటుందని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రజలపై తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దబోదని ఆయన చెప్పారు. 2012లో కొందరు నేతల మధ్య అహంకారం పెరిగిపోవడం వల్లే ఓటమి పాలైనట్టు ఆయన చెప్పారు. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీలో కీలకబాధ్యతలను తీసుకొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.
వారసత్వ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలే ముందుకువచ్చేలా కన్పిస్తున్నాయని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. అఖిలేష్యాదవ్, స్టాలిన్, సినిమాల్లో అభిషేక్ బచ్చన్, వ్యాపారంలో అంబానీ తనయుడి పేర్లను రాహూల్ ప్రస్తావించారు.