ప్రమాణ స్వీకారాన్ని టీవీలో వీక్షించిన మోడీ తల్లి
గాంధీనగర్: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి 4 వేల మంది ఢిల్లీ తరలి వస్తే అక్కడికి వెళ్లలేకపోయిన ఆయన తల్లి హీరాబెన్ మాత్రం కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు. గాంధీనగర్లోని మోడీ సోదరుడు పంకజ్ మోడీ ఇంట్లో ఉంటున్న ఆమె కుటుంబసభ్యులందరితో కలిసి ప్రత్యకప్రసారాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది మీడియా ప్రతినిధులు ఆమె స్పందన కోసం ప్రశ్నించగా ప్రశాంతంగా జవాబిచ్చారు. 'మోడీకి నా ఆశీస్సులు ఉంటాయి. దేశాన్ని మోడీ అభివృద్ధి మార్గంలో నడిపిస్తాడు' అని హీరాబెన్ అన్నారు.
చిన్న గదిలో కూర్చుని 92 ఏళ్ల హీరాబెన్ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించారు. బిజెపి విజయ సాధించిన తర్వాత నరేంద్ర మోడీ తన తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు
మోదీ ప్రధాని పదవిని చేపట్టడంతో కుటుంబసభ్యులందరికీ ఎంతో గర్వంగా ఉందని ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ అన్నారు. 'చాలా ఆనందంగా ఉంది. కుటుంబమంతా గర్విస్తున్నాం. ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లాలనుకున్నాం. కానీ మోడీ దృష్టిని మా వైపు మరల్చడం మాకు ఇష్టం లేదు. కుటుంబానికి మోదీ ఏదో మేలు చేసేశారంటూ ఎవరూ వేలెత్తి చూపించకూడదు.' అని ఆయన చెప్పారు.