ఓటమి అందరిదీ!: భాగవత్ వ్యాఖ్యలే., చాణక్య 'సారీ'
పాట్నా/ఢిల్లీ: పార్టీ గెలుపోటములకు ఒకరినే బాధ్యుల్ని చేయలేమని, మహాకూటమిలో పరస్పర ఓటు బదిలీపై తమ అంచనాలు తప్పాయని బిహార్ ఫలితాలపై బిజెపి పార్లమెంటరీ బోర్డు పేర్కొంది. బిహార్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎదురైన ప్రతికూల ఫలితాలకు ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేయడానికి బిజెపి నిరాకరించింది.
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి అన్న విమర్శలను కూడా తోసిపుచ్చింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు సోమవారం సమావేశమై బిహార్ ఎన్నికల్లో పార్టీ పని తీరును సమీక్షించింది. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర అగ్రనేతలు హాజరయ్యారు.
మహాకూటమి కూర్చుకున్న రాజకీయ సమీకరణాల పరిమాణం ఎన్డీయే కూర్చుకున్న దానికన్నా పెద్దదని, ఓటమికి ఇదే ప్రధాన కారణమని సమావేశం అభిప్రాయపడింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఓట్లు పరస్పరం బదిలీ కావన్న పార్టీ అంచనా తప్పని తేలిందని చెప్పారు.
మోహన్ భాగవత్ వ్యాఖ్యలు పార్టీకి బీహార్ ఎన్నికల్లో నష్టం చేకూర్చాయని పలువుర ఎన్డీయే నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లను పునసమీక్షించాలన్న ఆయన వ్యాఖ్యల వల్ల బిసిలు, దళితులు దూరమయ్యారని అంటున్నారు.
క్షమాపణలు కోరిన టుడేస్ చాణక్య
తాము వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పయినందుకు చాణక్య సంస్థ క్షమాపణలు కోరింది. కంప్యూటర్ టెంప్లేట్ కోడింగ్లో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఈ తప్పిదం జరిగిందని పేర్కొంది. ఫలితాల వెల్లడి అనంతరం తాము తప్పు ఎక్కడ చేశామో పరిశీలించామని, కూటములు తారుమారయినట్లు గుర్తించామంది.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు 161 (ప్లస్-మైనస్ 11) వస్తాయని చాణక్య సంస్థ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే మహాకూటమిక 170కి పైగా స్థానాల్లో గెలిచింది.
కంప్యూటర్ పొరపాటు కారణంగా స్థానాల సంఖ్యలో మార్పు లేకున్నా కూటములు మాత్రం తారుమారయ్యాయని, ఇలా ఎందుకు జరిగిందో కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పింది. కారణం ఏమయినా తప్పిదానికి బాధ్యతను తీసుకుంటున్నామని, నిజాయతీగా క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది.