వాతావరణం రిపోర్ట్: టీ-ఏపీలలో వర్షాలు, ముంబైలో ఎమర్జెన్సీ టైంలో ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు
న్యూఢిల్లీ: కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవా, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది. జూన్ 9వ తేదీ నుంచి ముంబైలో భారీ వర్షాలు కురవనుందని తెలిపింది.
Recommended Video
పుణేలోని కొన్ని ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముంబై, కొంకణ్ - గోవా, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరద ముప్పు ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటక, రాయలసీమలోని పలు ప్రాంతాలు, దక్షిణ కోస్తాంధ్ర, వెస్ట్ సెంట్రల్ బంగాళాఖాతానికి మరింత విస్తరించాయి.
సెంట్రల్ అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్లోని కొన్ని ప్రాంతాలు, గోవా, మరిన్ని కర్ణాటక, రాయమలసీమ ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి.
మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర తదితర ప్రాంతాలలో రానున్న 48 గంటల్లోనూ నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం.. రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో గురువారం, జూన్ 8న వర్షాలు కురవనున్నాయి. కొంకణ్ జిల్లాలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు.
భారీ వర్ష సూచన నేపథ్యంలో రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయ కంట్రోల్ రూమ్, డివిజనల్ కమిషనర్ ఆఫీస్, జిల్లా కలెక్టర్ ఆఫీస్, మున్సిపల్ కార్పోరేషన్, తహసీల్దారు కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైన పరిస్థితుల్లో ముంబై ప్రజలు 1916కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. అత్యవసర సమయంలో ముంబై బయటి వారు 1077కు ఫోన్ చేయవచ్చు.
నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవనాలు ఇప్పటికే ఏపీలోని కర్నూలు, మచిలీపట్నంలోకి ప్రవేశించాయన్నారు. మొదట మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. రుతుపవనాల రాకముందే వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ సీజన్లో సెంట్రల్ ఇండియాలో సాధారణ వర్షపాతం, దక్షిణాది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం 101 శాతం ఉటుందని తెలిపింది.