వెదర్ రిపోర్ట్: కల్లోలంగా అరేబియా సముద్రం, భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో రానున్న 3-4రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దేశం మొత్తం నైరుతి పవనాలు వ్యాపించి ఉన్నందున ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశం, నార్త్ పెనిన్సూలర్ ప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు భారీగా కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
అమృత్సర్, ఛండీగఢ్, షాహజాన్పూర్, గోరఖ్పూర్, నవడా, బంకురా, దిఘా, తూర్పు, దక్షిణ ప్రాంతాలు, బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో జులై 6 నుంచే వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపింది.
అరేబియా సముద్రంలో కొంత కల్లోల వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రానున్న మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉండనున్న క్రమంలో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గోవా తీరంలో శని, ఆదివారాల్లో సముద్రంపై వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు జులై 6నే హెచ్చరికలు జారీ చేసింది. గురువారం రాత్రి నుంచే గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోవాలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి, రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం సాధారణ వర్షపాతం నమోదైంది.