‘ఎప్పటికీ వెలగని ట్యూబ్లైట్’: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టర్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పదంగా చిత్రీకరించిన ఫొటోలు ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
ఆగ్రా: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పదంగా చిత్రీకరించిన ఫొటోలు ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నటించిన 'ట్యూబ్లైట్' చిత్రం పోస్టరుపై సల్మాన్ చిత్రం స్థానంలో రాహుల్గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేశారు.
ఆ తర్వాత దానిపై 'కభీ నా జల్నే వాలి ట్యూబ్లైట్(ఎప్పటికీ వెలగని ట్యూబ్లైట్)' అంటూ ట్యాగ్లైన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్గా మారింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డాగీ ఫిలిమ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్ నిర్మించారని పోస్టరుపై పేర్కొన్నారు.
అంతేగాక, ఆ పోస్టరులో 'క్యా తుమే యఖీన్ హై కీ మైనే పీఎం బనుంగా' అంటూ మరో ట్యాగ్ లైన్ తగిలించారు. 'నేను ప్రధాని అవుతానని మీకు నమ్మకముందా?' అంటూ రాహుల్ ప్రశ్నిస్తున్నట్లు మరో ట్యాగ్ లైన్ పెట్టారు.
కాగా, రాహుల్ గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ హత్రాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణేష్ మోహన్ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకూ తాము ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
Recommended Video
సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై పెట్టిన ఈ పోస్టు ప్రతిపక్ష పార్టీల మానసిక స్థితికి నిదర్శనమని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అనుశేష్ శర్మ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని అప్రతిష్ట పాలు జేసేందుకే కొందరు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వివేక్ బన్సాల్ వ్యాఖ్యానించారు.