మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్రం యూటర్న్- గందరగోళం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తొలుత వార్తలొచ్చినప్పటికీ.. అది నిజం కాదని తెలుస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించినట్లు వెల్లడించిన ట్వీట్ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, జల్శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ డిలేట్ చేశారు. దీన్ని పోస్ట్ చేసిన ఓ గంట తరువాత ఈ సమాచారాన్ని తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్లో నుంచి తొలగించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో- మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందనే విషయాన్ని తొలుత ప్రకటించింది ఆయనే. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందిందని, ఒక్క మోదీ ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతుందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ చెప్పారు. మోదీకి శుభాకాంక్షలూ తెలిపారు. ఆ తరువాత ఈ పోస్ట్ను ఆయన డిలెట్ చేశారు.
దీని తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీనితో ఈ బిల్లు ఆమోదం పొందిందా? లేదా? అనే విషయం గందరగోళం నెలకొంది. బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో ప్రకటిస్తారని, అప్పటివరకు దీన్ని పక్కన పెట్టినట్టేనని చెబుతున్నారు.
అయిదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. పలు కీలకాంశాలు, ఈ ప్రత్యేక సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టదలిచిన బిల్లులపై చర్చించారు. వీటిల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉందని, ఇది కూడా ఆమోదం పొందినట్లు ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications