యువతిపై దారుణం.. 'గ్యాంగ్ రేప్'తో దిగ్భ్రాంతి.. వీధుల్లో నగ్నంగా..
అత్యాచార దాడి తర్వాత బాధిత యువతి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. బాల్కనీ నుంచి తప్పించుకున్న యువతి.. నగ్న స్థితిలోనే వీధిలోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: తమతో కలిసి పార్టీలో పాల్గొనాలని ఆహ్వానించినందుకు.. తెలిసిన వ్యక్తే కదా! అని ఓ యువతి అతన్ని అనుసరించింది. తీరా అక్కడికెళ్లాకా.. అప్పటికే అక్కడ పాగా వేసిన స్నేహితులతో కలిసి సదరు యువకుడు ఆమెను గ్యాంగ్ రేప్ చేశాడు. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ ఘోరం.. ఈ ఉదయం వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ ప్రాంతంలో నివసించే ఓ యువతిని ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. యువతిని ఒక అపార్ట్ మెంటులోని ఫ్లాటులో బంధించి తెల్లవారుజాము దాకా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి.. ప్లాటు బాల్కనీ గోడ నుంచి కిందకు జంప్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
యువతి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు.
నిందితులను లక్షయ్ భల్లా, వికాస్ కుమార్, నవీన్, స్వారిత్, ప్రతీక్ గా గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నోయిడాలోని ప్రైవేట్ కాల్ సెంటర్స్ లో పనిచేస్తుండగా, స్వారిత్ టెక్ మహీంద్రాలో ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
బాధిత యువతి ఇద్దరు పిల్లల తల్లి అని, దక్షిణ ఢిల్లీలోని మునిర్ఖా ప్రాంతంలో నివసిస్తోందని చెప్పారు. నిందితుల్లో ఒకరైన వికాస్ ఆమెకు పరిచయమున్న వ్యక్తే అని పేర్కొన్నారు. గత రాత్రి మునిర్ఖాలో నిందితుడు వికాస్ తనను కలిశాడని, స్నేహితుడి ఇంట్లో పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించాడని బాధితురాలు తెలిపింది.
అతని ఆహ్వానం మేరకు బాధితురాలు అతని వెంట బయలుదేరగా.. మార్గమధ్యలో వికాస్ స్నేహితులు మరో ఇద్దరు తోడయ్యారు. వికాస్ సహా వారిద్దరు కలిసి ఆమెను ఓ ఫ్లాటుకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ మరికొంత మంది స్నేహితులు ఉండటంతో.. సదరు యువతి పరిస్థితిని పసిగట్టింది.
అయితే ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అంతా కలిసి బలవంతంగా ఆమెతో ఆల్కాహాల్ తాగించి.. ఆపై గ్యాంగ్ రేప్ కు ఒడిగట్టారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. అపార్ట్ మెంటులోని అలారం మోగించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యువతిని హెచ్చరించారు.
తెల్లవారుజాము దాకా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం 5.30గం. ప్రాంతంలో బాల్కనీ నుంచి ఆమె తప్పించుకుంది. ఆ సమయంలో దారిని వెళ్తున్న కొంతమందికి తనపై అత్యాచార దాడి జరిగినట్లుగా చెప్పడంతో.. వారిలో ఒకరు విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. అత్యాచార దాడి తర్వాత బాధిత యువతి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. బాల్కనీ నుంచి తప్పించుకున్న యువతి.. నగ్న స్థితిలోనే వీధిలోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
అయితే వారంతా అలా చూస్తూ ఉండిపోయారే తప్పితే.. సహాయం చేయడానికి ఎవరూ ముందుకురాకపోవడం గమనార్హం. చివరకు ఓ ఆటో రిక్షా వ్యక్తి ముందుకు వచ్చి.. ఆమెకు సహాయం చేశాడు. పోలీస్ స్టేషన్ వద్ద దిగబెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం యువతిని లాల్ బహదూర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. యువతి కాళ్ల మీద గాయాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలియజేశారు.