పెళ్లి కాకుండా గర్భిణీ: పరువు పోతుందని నరికేసిన తల్లి
ముంబై: తన కూతురు గర్భవతి అని తెలుసుకున్న ఓ తల్లి ఆమెను దారుణంగా నరికి చంపిన సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పఠారీ తెహసీల్లోని ముద్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. కూతురు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆమెను నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది.
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూతురును హత్య చేసిన తల్లి.. ఆ తర్వాత తప్పుడు ఫిర్యాదు చేసింది.
తన కూతురును ఎవరో హత్య చేశారని, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు... మృతి చెందిన అమ్మాయికి పరీక్షలు చేయించారు. ఆమె గర్భవతి అని తేలింది.
ఆ దిశలో పోలీసులు విచారణ జరిపారు. తల్లిపై అనుమానం కలిగి ప్రశ్నించారు. విచారణలో మైనర్ అయిన తన కుమార్తె గర్భిణి అని తెలిసిందని, దానికి కారణం ఎవరని నిలదీయగా అతని పేరు చెప్పేందుకు బాలిక నిరాకరించిందని, విసిగిపోయిన తాను కనీసం అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చానని, దానిని తన కూతురు తిరస్కరించిందని తెలిపింది. దీంతో తన కూతురు గర్బిణీ అని తెలిస్తే పరువు పోతుందని భావించి హత్య చేసి కట్టు కథ అల్లినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.