మోగ్లీ 2.0 : కోతులతో కలిసి ఉంటూ.. కోతిలా మారిపోయిన బాలిక
మోగ్లీ 2.0 : కోతులతో కలిసి ఉంటూ.. కోతిలా మారిపోయిన బాలిక
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ బాలిక(8) కొన్నాళ్లుగా కోతులతో కలిసి ఉంటూ కోతిలా మారిపోయింది. ఇప్పుడు అచ్చం కోతిలాగే తింటోంది.. కోతిలాగే ప్రవర్తిస్తోంది. మనుషులను చూస్తే భయపడుతోంది. పోలీసులు ఎంతో శ్రమించి ఆ బాలికను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడి కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని శాంక్చురీలోని మోతిపూర్ రేంజ్ లో ఎస్సై సురేశ్ యాదవ్ రెండు నెలల క్రితం పెట్రోలింగ్ చేస్తుండగా ఈ బాలిక ఆయన కంట పడింది. ఓ కోతుల గుంపులో ఈ బాలిక ఉంది.
ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. కోతులతోపాటు ఆ బాలిక కూడా అరవడం మొదలుపెట్టింది. దీంతో అతికష్టం మీద ఆ బాలికను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడడం లేదు. ఏ భాషనూ అర్థం చేసుకోవడం లేదు.
మనుషులు దగ్గరికొస్తే భయపడుతోంది. అప్పడప్పుడు వింతగా ప్రవర్తిస్తూ.. దగ్గరికి వెళితే దాడి చేస్తోందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. చికిత్స తరువాత కొంత మేర కోలుకున్నట్లు కనిపిస్తోందని, నిదానంగా ఆమెలో మార్పు వస్తోందని వారు పేర్కొంటున్నారు.
ఇంతకుముందు ఏదైనా పెడితే కోతిలాగే తినేదని, ఇప్పుడు ఆహారాన్ని నేరుగా నోటి ద్వారా తీసుకుంటుందని, కాళ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నప్పటికీ ఆ బాలిక ఇప్పటికీ జంతువుల మాదిరిగా కాళ్లు చేతులు ఉపయోగించి నడుస్తోందని వారు వివరించారు.