8 ఏళ్ల బాలుడి ఒడిలో తమ్ముడి మృతదేహం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
ఈ ఫొటో చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు పెడతారు. ఈ విషాద గాధ వింటే ప్రతి ఒక్కరూ చలిస్తారు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సరిపడా డబ్బులు లేక తండ్రి పడుతున్న ఇబ్బందులు, తన ఒడిలో తమ్ముడి మృతదేహంతో అంబులెన్స్ కోసం ఎదురుస్తున్న ఓ ఎనిమిదేళ్ల బాలుడు... ఈ దృశ్యం మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. తన చేతుల్లో ప్రాణం లేని తమ్ముడితో నిస్సహాయంగా చూస్తున్న బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
అంబులెన్స్ లేక
మురైనా జిల్లా అంబాహ్ మండలం బడ్ఫరా గ్రామానికి చెందిన పూజారామ్ జాటవ్కు నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది నెలల క్రితం భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది.గత కొద్ది రోజులుగా రెండేళ్ల చిన్న కుమారుడు రక్తహీనత, కడుపులో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో ఆ బాలుడిని అంబాహ్ నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పిటికే బాలుడి పరిస్థితి విషమించి చనిపోయాడు.వారిని స్వగ్రామం నుంచి మురైనాకు తీసుకొచ్చిన అంబులెన్స్ అప్పటికే వెళ్లిపోయింది.
Recommended Video
పోలీసుల సాయంతో
అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే.. డ్రైవర్ రూ.1500 అడిగాడు. కాస్త తక్కువ ధరలో ఏమైనా దొరుకుతుందేమోనని పూజారామ్ వెతుకుతున్నాడు. పెద్ద కుమారుడు ఒడిలో మృతదేహాన్ని ఉంచి పూజారామ్ వాహనం కోసం తిరుగుతున్నాడు. గుల్షాన్ తన సోదరుడి శవంతో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పూజారామ్ రాగానే.. అంబులెన్స్ను ఏర్పాటు చేసి.. మృతదేహాన్ని అతని స్వస్థలానికి పంపించారు.
కమల్ నాథ్ ట్వీట్
అయితే గత ఐదు నెలల్లో మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.ఈ ఘటనపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంబులెన్స్ లు అందుబాటులో లేక గర్భిణీలు కూడా ప్రాణాలు కోల్పోవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదిఏమైనప్పటికీ ఈ ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. వీడియోలో బాలుడిని చూసిన వారు భావోద్వేగానికి లోనవుతున్నారు.