మిస్టర్ ట్రంప్! అంబానీ వల్లే మాకు రూ. 23వేల కోట్ల లాభాలు: ఒప్పేసుకున్న జుకర్బర్గ్
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో అధినేత ముకేష్ అంబానీ వల్లే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్కు వందల కోట్ల డాలర్ల లాభాలు వస్తున్నాయట.
న్యూఢిల్లీ: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో అధినేత ముకేష్ అంబానీ వల్లే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్కు వందల కోట్ల డాలర్ల లాభాలు వస్తున్నాయట. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ స్వయంగా చెప్పడం విశేషం. అంతేగాక, తనకు చేసిన సాయానికిగాను ముఖేష్ అంబానీకి జుకర్బర్గ్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు కూడా.
ఇందుకు సంబధించిన వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ జియో 2016, సెప్టెంబర్ 5 నుంచి భారత్ లో ఉచిత సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఉచిత ఆఫర్లతో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో ఫేస్బుక్ నికర లాభాలు ఏకంగా 128 శాతం ఎగిశాయి. 2016 డిసెంబర్ 31 నాటికి ముగిసిన త్రైమాసికానికి ఫేస్బుక్ లాభాలు 3.57 బిలియన్ డాలర్ల(రూ.23,567కోట్లకు పైగా)గా నమోదయ్యాయి.
గత ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు కేవలం 1.56 బిలియన్ డాలర్లగానే ఉన్నాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఆఫర్ చేస్తున్న ఉచిత డేటా ఆఫర్లు నాలుగో క్వార్టర్లో ఫేస్ బుక్ రిపోర్టు చేసిన బలమైన లాభాలకు ఎంతో సహకరించాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నారు.
ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఫేస్ బుక్ సీఎఫ్ఓ డేవిడ్ వెనర్ కూడా, ఆసియా నుంచి కంపెనీ గ్రోత్ అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇండియాలో ఆఫర్ చేసే ఉచిత డేటా ఆఫర్లతో ఆసియాలో కంపెనీ వృద్ధి ఎక్కువగా నమోదవుతుందని చెప్పుకొచ్చారు.
కాగా, ఇండియా నుంచి ఫేస్బుక్కు 160 మిలియన్ యూజర్లున్నారు. ఫేస్బుక్ హోమ్ గ్రౌండ్ తర్వాత భారతే రెండో అతిపెద్ద దేశం. మొబైల్ అడ్వర్ టైజింగ్ రెవెన్యూలో యేటికేటికి 53 శాతం వృద్ధిని సాధిస్తోంది.