కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ- ఆనంద్ పిరామల్ దంపతులు..!!
ముంబై: ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త ఇషా అంబానీ తల్లి అయ్యారు. కవల పిల్లలను జన్మనిచ్చారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ఆమె భర్త ఆనంద్ పిరామళ్. పిరామళ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కు అధినేత ఆయన. తన కుమార్తె కవలలకు జన్మనిచ్చినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇషా అంబానీ.. ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. బాబు, పాప జన్మించినట్లు తెలిపింది. వారికి ఆదియా, కృష్ణగా నామకరణం చేయనున్నట్లు ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా-ముఖేష్ అంబానీకి ఇది వరకే మనవడు పుట్టాడు. 2020 డిసెంబర్లో కుమారుడు ఆకాశ్ అంబానీ- కోడలు శ్లోకా ఓ బాబుకు జన్మనిచ్చారు.
2018 డిసెంబర్ 12వ తేదీన ఇషా అంబానీ- ఆనంద్ పిరామల్ వివాహం జరిగింది. పిరామల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ అజయ్-స్వాతి పిరామల్ దంపతుల కుమారుడు ఆనంద్. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుకున్నాడు ఆనంద్ పిరామల్. ఎకనమిక్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. వ్యాపార రంగంలో స్థిరపడిన తరువాత పిరామల్ రియాలిటీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని నెలకొల్పారు.
అంతకుముందు- పిరామల్ స్వాస్థ్య పేరుతో రూరల్ హెల్త్కేర్ను ఏర్పాటు చేశారు. గతంలో ఇండియన్ మర్చంట్ ఛాంబర్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇషా అంబానీ కూడా వ్యాపారరంగంలో స్థిరపడ్డారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తోన్నారు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇదీ ఒకటి. రిటైల్ వ్యాపారం మొత్తం ఈ వెంచర్స్ కిందే ఉన్నాయి. వివాహం కావడానికి ముందే ఆమె రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు.