Ambani:లండన్లో సామ్రాజ్యం..భూతల స్వర్గాన్ని తలపిస్తూ: 590 కోట్లతో కొత్త ప్రపంచం..!!
లండన్ : భారత దేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఏం చేసినా సంచలనమే. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ఈ బిజినెస్ మ్యాగ్నెట్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒకప్పుడు తాను కట్టుకున్న అత్యంత విలాసవంతమైన బంగ్లా ఆంటిలియా(Antilia)ప్రపంచ దేశాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. తాజాగా ఈ అపరకుబేరుడు మరో విలాసవంతమైన భవనం కొనుగోలు చేసి తమ అభిరుచికి తగ్గట్టుగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇది భారత్లో కాదు.. లండన్లో. ఇంతకీ ఏంటా భవనం.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం...
లండన్లో మరో విలాసవంతమైన భవనం
భారత అపరకుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు ముంబైలో నివాసముంటున్న అత్యంత విలాసవంతమైన బంగ్లా ఆంటిలియా కాకుండా లండన్లో మరో విలాసవంతమైన భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అపరకుబేరుడు లండన్లోని బకింగ్హామ్షైర్లోని స్టోక్ పార్క్లో అత్యంత విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అది నిర్మాణం పూర్తికాగానే కుటుంబంతో సహా అక్కడికి మకాం మారుస్తారని వార్తలు వస్తున్నాయి.
స్టోక్పార్క్ బంగ్లాకు అంబానీ
కరోనా కోరలు చాచిన వేళ లాక్డౌన్ విధించిన సమయంలో ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ముద్రపడ్డ ఆల్టామౌంట్ రోడ్లోని ఆంటిలియా బంగ్లాలోనే కాలం గడిపారు. దీంతో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరో చోటుకు వెళ్లాలంటే కష్టంగా ఉంటుందని భావించిన అంబానీ... అందుకు లండన్లో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో తనకున్న స్థలంలో మరో విలాసవంతమైన భవనం నిర్మించాలని తలచినట్లు సమాచారం. ఈ ఏడాది మొదట్లో లండన్లోని స్టోక్పార్క్లో రూ.592 కోట్లు పెట్టి స్థలాన్ని కొనుగోలు చేశారు అంబానీ. ఇప్పుడు ఇక్కడే కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.
స్టోక్ పార్క్ బంగ్లా ప్రత్యేకతలు ఇవే
ఇక స్టోక్ పార్క్లో నిర్మించనున్న బంగ్లాలో 49 బెడ్రూంలు, అత్యంత ఆధునిక పరికారాలు ఉన్న మెడికల్ ఫెసిలిటీ, ముంబైలో తన నివాసంలో ఉన్న ఆలయంలానే ఇక్కడ కూడా ఒక ఆలయం ఉంటాయట. ఈ ఆయంలో వినాయకుడు, హనుమాన్ రాధాకృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తయారు చేసేందుకు రాజస్థాన్ నుంచి శిల్పిలను రప్పిస్తున్నారు. అంతేకాదు నిత్యం పూజలు జరిగేలా భారత్ నుంచే లండన్కు ఇద్దరు పూజారులను తీసుకెళుతున్నట్లు సమాచారం. ఇక దీపావళికి నిర్మాణంలో ఉన్న ఈ కొత్త ఇంటికే అంబానీతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లినట్లు సమాచారం. దీపావళి తర్వాత భారత్కు వచ్చి, తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో యూకే బంగ్లాకు మకాం మారుస్తారని సమాచారం.
300 ఎకరాల ప్రాపర్టీ కొనుగోలు
ఇక ముంబైలోని యాంటిలియా బంగ్లా నిటారుగా ఆకాశాన్నంటేలా కనిపిస్తుంది. కానీ లండన్లో నిర్మించనున్న భవనం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గతేడాది కొత్త ఇంటి కోసం స్థలం చూడటం ప్రారంభించింది అంబానీ కుటుంబం. అలా స్టోక్ పార్క్ వారి దృష్టిలో పడగానే ఇంతకంటే మంచి స్థలం ఉండదని భావించి వెంటనే 300 ఎకరాల ప్రాపర్టీని కిలో టమాటాలు కొన్నంత సులభంగా కొనేశారు. ఇక గతేడాది ఆగష్టు నెల నుంచే కుటుంబ సభ్యుల అభిరుచికి తగ్గట్టుగా ప్లాన్ చేసి పనులను ప్రారంభించారు.
Recommended Video
స్టోక్ పార్క్ చరిత్ర ఇదీ
1908 తర్వాత స్టోక్ పార్క్ బంగ్లా ప్రైవేట్ రెసిడెన్స్గా మారిపోయింది. ఆ తర్వాత దీన్ని కంట్రీ క్లబ్గా మార్చారు. అంతేకాదు ఈ బంగ్లాను జేమ్స్ బాండ్ చిత్రం కోసం కూడా వినియోగించినట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత విలాసవంతమైన ఈ బంగ్లాలో సకల సదుపాయాలతో పాటు ఓ చిన్నపాటి హాస్పిటల్ కూడా ఉంది. ఇది ఒక బ్రిటీష్ డాక్టర్ నేతృత్వంలో నడుస్తుంది.అయితే ఇప్పటి వరకు అంబానీ కుటుంబం కానీ అంబానీ గ్రూప్ నుంచి కానీ ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.