బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్కు మామ ములాయం సింగ్ ఆశీస్సులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె మామ ములాయం సింగ్ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Recommended Video
మామ ములాయం నుంచి ఆశీస్సులు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు అపర్ణ యాదవ్. బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మామయ్య ములాయం ఇంటికి వచ్చి, ఆశీస్సులు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు అపర్ణ యాదవ్. ఆమె బీజేపీలో చేరడంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పటికే స్పందించారు.
అపర్ణ యాదవ్ను బీజేపీలో చేరకుండా ఆపేందుకు నేతాజీ(ములాయం సింగ్) తీవ్రంగా ప్రయత్నించారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అంతేగాక, తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అపర్ణ యాదవ్ పార్టీ మార్పు ఎస్పీ సిద్ధాంతాన్ని విస్తరించేందుకు దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. తమ బంధువులు, కుటుంబసభ్యులు ఇతర పార్టీలోకి వెళ్లడంతో తనపై ఒత్తిడి కూడా తగ్గిందని పేర్కొన్నారు.
भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U
— Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022
కాగా, గురువారం ములాయం సింగ్ తోడల్లుడు ప్రమోద్ గుప్తా కూడా సైకల్(సమాజ్ వాదీ పార్టీ)ని వీడి బీజేపీలో చేరారు. గతంలో ఎస్పీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రమోద్.. ములాయం రెండో భార్య సాధన గుప్తా సోదరి భర్త. ప్రమోద్ ఎస్పీని వీడుతున్న సందర్భంలో తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి ములాయంను అఖిలేష్ యాదవ్ ఓ ఖైదీలా బంధించి ఉంచారని, నేతాజీని బహిరంగంగా మాట్లాడనీయడం లేదని ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీలో నేరస్తులకు ప్రాధాన్యత పెరిగిందని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ పలువురు నేతలు పార్టీ మారడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఓపీనియన్ పోల్స్ మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో కంటే బీజేపీకి సీట్లు తక్కువగా వస్తాయని, అఖిలేష్ పార్టీ పుంజుకుంటుందని పేర్కొన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలిపాయి.