యూపీలో మరోసారి అనూహ్యం: ములాయం వ్యాఖ్యల ఎఫెక్ట్, ఎస్పీ-బీఎస్పీకి సీట్ల కోత తప్పదా?
లక్నో: సమాజ్వాది పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ బుధవారం లోకసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని, ఆయన సమర్థవంత నేత అని పార్లమెంటు ముగింపు సమావేశాల సందర్భంగా అన్నారు. ఎన్డీయేకు ఈసారికి ఇవి చివరి సమావేశాలు. ఆ తర్వాత ఎన్నికలు రానున్నాయి.
ఈ నేపథ్యంలో లోకసభలో ఈ టర్మ్కు గాను ఆఖరులో ములాయం.. మోడీపై ప్రశంసలు కురిపించారు. ములాయం ఆ మాటలు చెబుతున్నప్పుడు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పక్కనే ఉన్నారు. ఆమె కాస్త ఇబ్బందిపడినట్లుగా కనిపించింది. అలాగే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.. ములాయం వ్యాఖ్యలతో విభేదీంచారు.

ములాయం ఎఫెక్ట్.. ఏమైనా జరగొచ్చు
ములాయం సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. యూపీలో దశాబ్దాలుగా ఎస్పీ, బీఎస్పీ మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. కానీ ఈసారి మోడీని, బీజేపీని ఓడించడం కోసం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టారు. అఖిలేష్ యాదవ్, మాయావతి ఒక్కటి అయ్యారు. 80 లోకసభ స్థానాలకు గాను చెరో 37 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.

మరోసారి అనూహ్యం తప్పదా?
గత ఎన్నికల్లో బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే బీజేపీ సీట్లు 40కి పైగా తగ్గి 30కి పడిపోతుందని పలు ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేసి ఎస్పీ, బీఎస్పీలు కలవడం ఓ అనూహ్య పరిణామం అయితే, ఇప్పుడు అఖిలేష్ తండ్రి, ఎస్పీ సుప్రీం ములాయం ప్రధానిపై ప్రశంసలు కురిపించడంతో యూపీలో ఇది మరో అనూహ్యమే అంటున్నారు.

బీఎస్పీ, ఎస్పీకి సీట్ల కోత?
ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మోడీకి ములాయం మద్దతు.. బీజేపీకి లాభిస్తుందని అంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పటికీ దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్నందున కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోలేరు. దీంతో ఎంతోకొంత అసంతృప్తి ఉంటుందని, ఇప్పుడు ములాయం వ్యాఖ్యలతో అది పెల్లుబుకి, బీజేపీకి లాభం చేకూరే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎస్పీ ఇప్పుడు అఖిలేష్ చేతిలో ఉన్నప్పటికీ... ములాయంను అభిమానించే వారు బీజేపీ వైపు దృష్టి సారించే అంశాన్ని కొట్టి పారేయలేమని అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో పాటు ముందు ముందు ఆయన బహిరంగంగా బీజేపీకి మద్దతిస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. బీజేపీకి ములాయం అండగా ఉంటే బీజేపీ సీట్లు పెరిగి, ఎస్పీ-బీఎస్పీ సీట్లకు కోతపడటం ఖాయమని చెబుతున్నారు. యూపీలో బీజేపీ ఎక్కువ సీట్లు కోల్పోనుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్పుడు ములాయం వ్యాఖ్యలు బీజేపీలో ఒకింత సంతోషాన్ని నింపాయి.












Click it and Unblock the Notifications