వీడియో: హోటల్ గదిలో మహిళ శవం, హత్యనా?
ముంబై: ఓ వివాహిత మహిళ శవం ముంబైలోని ఓ హోటల్ గదిలో గురువారం వెలుగు చూసింది. 23 ఏళ్ల ఆ మహిళను పోలీసులు ముంబైకిలోని శాంతాక్రజ్ (తూర్పు)లోని గోలిబార్ ప్రాంతానికి చెందిన రషీదా సూరత్వాలాగా గుర్తించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.
ఓ బంధువు పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నట్లు రషీదా ఇంటిలో చెప్పినట్లు సమాచారం. మిలన్ ఇంటర్నేషనల్ హోటల్లోని 205 నెంబర్ గదిలో గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రషీదా మరణించినట్లు సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ అరుణ్ చౌహాన్ చెప్పారు.
అయితే, పోలీసులు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అక్కడికి చేరుకున్నారు. హత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చౌహాన్ చెప్పారు. రషీదా, ఆమె వదిన గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా యాభై నిమిషాలకు చేరుకున్నారని, వారు షాహిద్ షేక్ అనే వ్యక్తి కోసం ఎదురు చూశారని, అతను రషీదాకు కాలేజీ రోజుల నుంచి పరిచయమని ఆయన వివరించారు.
షాహిద్ షేక్ సాయంత్రం 3 గంటలకు హోటల్కు వచ్చాడని, రషీదా వదినను బయట నిరీక్షించాలని చెప్పాడని, కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని చెప్పి రషీదాను హోటల్ గదికి తీసుకుని వెళ్లాడని ఆయన చెప్పారు. దాదాపు ఐదు గంటల పాటు లాబీలో నిరీక్షించిన రషీదా వదిన గదికి వెళ్లి తలుపు త్టటిందని, లోపలి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన కనిపించలేదని, దీంతో ఆమె హోటల్ సిబ్బందిని పిలిచిందని, వాళ్లు డుప్లికేట్ కీతో తలుపులు తెరిచారని ఆయన వివరించారు.
రషీదా పడకపై పడి ఉందని, ఆమె ముఖం నల్లగా మారిందని, దిండు సాయంతో గొంతు నొక్కినట్లు అర్థమవుతోందని చౌహాన్ చెప్పారు. ఆమె శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
<center><center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/0H34U-BDvDE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>