స్నేహితుడి భార్యపై కామెంట్స్: బ్యాంక్ అధికారి గొంతుకోసి, 12 ముక్కలు చేశారు, 2 సూట్కేసుల్లో పెట్టి..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దిగ్గజ ప్రైవేటు బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ గురువారం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అతని శరీరాన్ని 12 ముక్కలు చేశారు నిందితులు. వర్లీలోని తన నివాసం నుంచి గత కొన్ని రోజులుగా అదృశ్యమైన అతడు హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులు అతని స్నేహితుడు, స్నేహితుడి భార్య నిందితులు కావడం గమనార్హం.
12న సుశీల్ కుమార్ సర్నాయక్ అదృశ్యం.. పిక్నిక్ అని..
వర్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రాంట్ రోడ్ బ్యాంక్ బ్రాంచీలో పనిచేస్తున్న బాధితుడు సుశీల్ కుమార్ సర్నాయక్(31) డిసెంబర్ 12న వర్లీ గాంధీనగర్లోని తన నివాసం నుంచి అదృశ్యమయ్యాడు. కాగా, సర్నాయక్ తన స్నేహితులతో పిక్నిక్ వెళతానని.. డిసెంబర్ 13న తిరిగి ఇంటికి వస్తానని చెప్పాడని అతడి తల్లి పోలీసులకు తెలిపింది. అతడు తిరిగి రాకపోవడంతో ఆమె అతని కోసం గాలింపు చేపట్టింది. అతడు పనిచేసే బ్యాంకుకు వెళ్లి ఆరా తీసిన ఫలితం లేకపోయింది. దీంతో డిసెంబర్ 14న వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డెడ్ బాడీ లభించిందంటూ..
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలోనే నేరల్ పోలీసులు గురువారం వారికి ఫోన్ చేసి ఓ డెడ్ బాడీ గురించిన వివరాలు తెలిపారు. నాలాలో రెండు సూట్ కేసుల్లో ఓ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. దీంతో ఆ బాడీ వద్దకు తీసుకెళ్లగా.. తమ కుమారుడిదేనని సర్నాయక్ తల్లిదండ్రులు గుర్తించారు.
సలోమీపై కామెంట్స్.. గొంతుకోసి, 12 ముక్కలు చేశారు..
కాగా, సర్నాయక్.. డిసెంబర్ 12న తన స్నేహితులైన చార్లెస్ నాడర్(41), అతని భార్య సలోమీ(31) ఇంటికి వెళ్లాడు. (సలోమీ.. ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న సమయంలో సర్నాయక్కు స్నేహితురాలిగా మారింది. ఆ తర్వాత ఆమె భర్త కూడా స్నేహితుడయ్యాడు) కాగా, ఆ రోజు రాత్రి సలోమీ వ్యక్తిత్వంపై సర్నాయక్ పలు ఆరోపణలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన చార్లెస్.. కత్తితో అతడి గొంతుకోశాడు. ఆ తర్వాత సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి రెండు సూట్ కేసులు తెచ్చారు. అనంతరం సర్నాయక్ మృతదేహాన్ని 12 ముక్కలు చేసి ఆ సూట్ కేసుల్లో కుక్కారు. వాటిని నాలాలో పారేశారు.
ఆ సూట్ కేసులే నిందితులను పట్టించాయి..
అయితే, చార్లెస్ దంపతులు కొన్న ఆ సూట్ కేసులే వారిని పట్టించాయి. ఆ సూట్ కేసులు ఎక్కడ కొన్నారని ఆరా తీయగా.. ఆ షాపు అడ్రస్ దొరికింది. ఆ షాపు యజమాని, అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో ఈ నిందితులు సూట్ కేసులను కొని తీసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు చార్లెస్, సలోమీలను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు.