ప్రముఖ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్ హత్య: డ్రైనేజీలో మృతదేహం
ముంబై: ప్రముఖ ఆర్టిస్(చిత్రకారిణి) హేమా ఉపాధ్యాయ్, ఆమె తరపు న్యాయవాది హరీష్ భాంబనీ హత్యకు గురయ్యారు. కందీవాలీలోని ఓ మురికి కాలువ వద్ద బాక్స్లో వీరి మృతదేహాలు శనివారం సాయంత్రం లభ్యమయ్యాయి. అయితే, వీరి హత్యకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.
మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 2013లో హేమ తన భర్త చింతన్పై కేసు పెట్టింది. మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
అంతేగాక, తన గదిలో అశ్లీల చిత్రాలు గీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో హేమ తరపున న్యాయవాది హరీష్ ప్రాతినిధ్యం వహించాడు. కాగా, హేమా ఉపాధ్యాయ్ భర్త చింతన్ కూడా చిత్రకారుడే.
భార్యాపిల్లలను కత్తితో పొడిచి భర్త ఆత్మహత్యాయత్నం
భార్యా పిల్లలను కత్తితో పొడిచి భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. విరార్కు చెందిన కృష్ణ కదమ్(40), కల్పిత కదమ్ అనే దంపతులకు సాయి(10), అతర్వా(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణ కదమ్ కూరగాయాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, బంద్రాలోని బాబా ఆస్పత్రిలో కల్పిత నర్సుగా పని చేస్తోంది.
వీరిద్దరి మధ్య శుక్రవారం రాత్రి ఆర్థిక విషయాలలో గొడవ చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న కదమ్ తన భార్య కల్పితను కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా తన ఇద్దరి పిల్లలను కత్తితో విచక్షణా రహితంగా పొడిచేందుకు యత్నించాడు.
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కల్పిత పిల్లలను రక్షించేందుకు యత్నించింది. పిల్లలను కూడా కత్తితో పొడుస్తున్న సమయంలో పెద్ద కుమారుడు సాయిని కల్పిత తన ఒడిలోకి తీసుకుంది. ఈ క్రమంలో కదమ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. చిన్నారుల ఏడుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కల్పిత ఆస్పత్రిలో మృతి చెందింది. కదమ్ పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం పిల్లలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పిల్లలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తండ్రి కదమ్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.