సెక్స్ వర్కర్ల ఆగడాలు, రెడ్ లైట్ ఏరియాపై స్థానికుల మండిపాటు
ముంబై: ముంబై నగరంలో సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాలకు రెండు వేల మంది వినతి పత్రాలు వ్రాశారు. వెంటనే రెడ్ లైట్ ఏరియాను ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు తరలిస్తే తమ జీవితాలు బాగుపడుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసియాలోనే కామాటిపుర జిల్లా రెడ్ లైట్ ఏరియాకు పేరు పొందింది. అయితే ఇక్కడ ఉన్న సెక్స్ వర్కర్లు రోజు రోజుకు వారి కార్యాకలాపాలు చుట్టు పక్కలకు విస్తరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న తమను వీరు రోడ్ల మీదకు ఈడ్చుతున్నారని స్థానికులు మండి పడుతున్నారు.
కామాటిపురలోని 11వ వీదికి మాత్రమే సెక్స్ వర్కర్ల కార్యకలాపాలు పరిమితం చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సెక్స్ వర్కర్లు రోజు రోజుకు బరితెగించి పోతున్నారని, తమ పిల్లలకు స్కూల్ లలో అడ్మిషన్లు ఇవ్వడం లేదని, ఆడ పిల్లలకు పెళ్లిళ్లు జరగడం లేదని, బంధువులు తమ ఇండ్లకు రావడం లేదని ఆరోపించారు.
సెక్స్ వర్కర్ల ఆగడాలను పోలీసులు చూసి చూడనట్లు వదిలి వేయడం, రోజు రోజుకు సెక్స్ వర్కర్లు పెరిగిపోవడంతో రెడ్ లైట్ ఏరియా ను గుట్టు చప్పుడు కాకుండా బ్రతుకుతున్న తమ ప్రాంతాలకు విస్తరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని మనవి చేస్తున్నారు.