షాక్: 3ఏళ్ల మనవడిని 6వ అంతస్తు నుంచి విసిరేశాడు
ముంబై: సాధారాణంగా మనవడు, మనవరాలు అంటే తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలకు ఎంతో ఇష్టం ఉంటుంది. వారిని ఎప్పుడూ ఎత్తుకుని ముద్దాడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ తాత మాత్రం కోపంతో తన మూడేళ్ల మనవడ్ని ఆరో అంతస్తు నుంచి కిందకి విసిరేసి ప్రాణాలు తీశాడు.
దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నివృత్తి ఖర్చేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నివృత్తి ఖర్చే కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్నాడు.
అంతేగాక, తన కోడలు సరిగా చూడటం లేదనే విషయంలో అతను అసంతృప్తిగా ఉండేవాడు. సమయానికి ఆహారం ఇవ్వడం లేదన్న కోపం కూడా అతనిలో రోజురోజుకూ ఎక్కువవుతూ వచ్చింది. ఆ కోపమే మురిపెంగ చూసుకోవాల్సిన మనవడి ప్రాణాలను తీయడానికి దారితీసిందని అనుమానిస్తున్నారు.
కాగా, చిన్నచిన్న విషయాలకే.. ఖర్చే కలతచెందేవాడని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహదేవ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఖర్చే, ఆయన కోడలి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగిందని చెప్పారు.
ఈ క్రమంలో మాటామాటా పెరగి, ఆ కోపంలో అక్కడే ఉన్న మూడేళ్ల మనవడిని పట్టుకుని బాల్కనీ నుంచి కిందక విసిరేశాడని చెప్పారు. దీంతో బాలుడు చనిపోయాడని ఆయన తెలిపారు. బాలుడిని చంపిన ఖర్చేపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి జూన్ 2 వరకూ పోలీసు కస్టడీకి పంపారు.