రాముడే ఇమామ్, అయోధ్యే పవిత్ర స్థలం: నవమి వేడుకల్లో ముస్లిం మహిళలు
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో శనివారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు. తమ ఇమామ్ శ్రీరాముడని, తమ పవిత్ర క్షేత్రం అయోధ్యేనని వారు తెలిపారు.
‘మా శ్రీరాముడు నివాసముండే అయోధ్యే మా పవిత్ర స్థలం. ఆయనే మా ఇమాక్' అని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం మహిళలు పేర్కొన్నారు. మత సామరస్యాన్ని చాటేందుకోసం విశాల్ భారత్ సంస్థాన్(విబిఎస్)తో కలిసి మహిళలు చాలా సంవత్సరాలుగా వేడుకలు జరుపుతున్నారు.
హకుల్గంజ్లోని వరుణనగరమ్ కాలనీలో నిర్వహించిన నవమి వేడుకల్లో ముస్లింలు మహిళలు పాల్గొని శ్రీరాముడ్ని కీర్తి పలు సంకీర్తనలు ఆలపించారు. ఉర్దూలో ‘రామ నామం' రాసి ‘రుద్రు రామ్ నామ్ బ్యాంక్'లో అందజేశారు.
నజ్నీమ్ అన్సారి శ్రీరామ్ ఆర్తి, శ్రీరామ్ ప్రార్థన చేశారు. ‘శ్రీరామ ప్రభువు మనందరికి పూర్వ నుంచి వస్తున్న దేవుడు. అందువల్ల ఆయన ఆర్తిలో అందరూ పాల్గొనాలి. కులాలు, మతాలు బేధాలు లేకుండా ఉత్సవాలను నిర్వహించాలి' అని చెప్పారు. ముస్లిం అయిన తనకు హిందూ దేవుడు రాముడిని పూజించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఎందుకంటే రామ అనే నామం అన్ని కష్టాలను తీరుస్తుందని చెప్పారు.
రాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శమని, ఆయనను పూజిస్తున్నందుకు తాము గర్వంగా భావిస్తున్నామని నజ్నీన్ తెలిపారు. అంతేగాక, ఆమె హనుమాన్ చాలీసాను ఉర్దూలోకి అనువాదించారు. దుర్గా చాలిసా తర్వాత ఆమె రామచరితమానస్ను కూడా ఉర్దూలోకి అనువదించే పనిలో నిమగ్నమయ్యారు.
కాగా, రామ నామంతో కూడిన ఓ దుప్పట్టాను కేంద్ర సమాచార కమిషనర్ ఓపి కేజ్రివాల్కు ఈ వేడుక సందర్భంగా నజ్నీన్ బహూకరించారు. నజ్మా పర్వీన్, మొహ్మద్ అజారుద్దీన్, రజీయా బేగం, షామ్స్ ఉన్ నిసా, హజ్రా బేగం, బిల్కీస్ బేగం తదితరు రామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
కాశీ నుంచి మతసామరస్యం దేశమంతా వ్యాప్తి చెందాలని వారు కోరుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం కావాలని ఆకాంక్షించారు. అంతేగాక, అయోధ్యలో రామమందిరాన్ని నెలకొల్పాలని కోరుతూ నజ్నీన్, ఆమె అనుచరులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రం పంపారు.
ముస్లింలు హిందువుల నుంచి గౌరవం పొందాలంటే రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, విబిఎస్ ఫౌండర్ రాజీవ్ శ్రీవస్తవ మాట్లాడుతూ.. శ్రీరామ నామాన్ని రాసిన వారూ ఎవరైనా వాటిని ‘రుద్రు రామ్ నామ్ బ్యాంక్'లో సమర్పించవచ్చని తెలిపారు. ఇందుకు కులాలు, మతాలు అడ్డురావడని చెప్పారు.