నా తండ్రి ఆత్మకథ రాయాలి: మన్మోహన్ సింగ్ కూతురు
న్యూఢిల్లీ: తన తండ్రి పదేళ్ల పాలన చివరి రోజుల్లో ప్రజాభిప్రాయం ఆయనకు వ్యతిరేకంగా మారడం బాధాకరమని, అలాగే తన తండ్రి తన ఆత్మకథను రాస్తే బాగుంటుందని తన తల్లిదండ్రుల జీవితంపై పుస్తకం రాసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దామన్ సింగ్ శనివారం అన్నారు.‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ సింగ్ అండ్ గురుశరణ్' పేరుతో దామన్ రాసిన పుస్తకం ఆదివారం మార్కెట్లో విడుదల అవుతోంది.
ప్రజాభిప్రాయం క్షణ భంగురమని, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని ఒక టీవీ న్యూస్ చానల్ కోసం కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అయితే ఇది మీకు బాధ కలిగించిందా అని నొక్కి అడగ్గా.. ఇది నిజంగా బాధాకరమే.. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పని చేశారని, ఆయన చేసిన పనిని ఎవరు కూడా ప్రశంసించకపోవడం నిజంగా బాధాకరమే అన్నారు.

మీడియాతో తన తండ్రి సంబంధాల గురించి ఆమె మాట్లాడుతూ, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడడాన్ని ఎంతో ఇష్టపడ్డారని, అయితే ఆ తర్వాత మీడియా మారిపోయిందన్నారు. ఆయన మారలేదు... మారింది మీడియానే అన్నారు. ఆ రోజుల్లో మీడియా సీరియస్ అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపించేదని, అంతేకాదు, అలాంటి సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం దానికి ఉండేదని నేను అనుకున్నానని చెప్పారు. తెలివైన సంభాషణలను తన తండ్రి ఎంతో ఇష్టపడే వారన్నారు.
కాగా, మన్మోహన్ సింగ్, ఆయన భార్య జీవితం గురించి తన పుస్తకంలో రాసిన దామన్ ప్రధానిగా ఆయన పని చేసిన పదేళ్ల కాలం గురించి మాత్రం ప్రస్తావించలేదు. సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టడానికి నిరాకరించి మన్మోహన్ సింగ్ను ప్రధాని పదవికి ఎంపిక చేసినప్పుడు ఆయన ఎలా భావించారని అడగ్గా, అది నిజంగా ఓ పెద్ద సవాలని, సవాలును ఎదుర్కోవడం తనకు దక్కిన గౌరవం, అవకాశంగా ఆయన భావించి ఉంటారని తాను అనుకుంటున్నానని అన్నారు.
తన తండ్రి తన ఆత్మకథను రాయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన రాస్తారో లేదో తాను కచ్చితంగా చెప్పలేను కానీ ఆయన రాయాలని మాత్రం తాను అనుకుంటున్నానని, ఎందుకంటే ఆయనలో ఎంతో జ్ఞానం, తెలివితేటలు, అనుభవం ఉన్నాయని, అది జాతికి ఒక సేవ అవుతుందని తాను అనుకుంటున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications