మోడీతో బంధం పవిత్రం, ఉద్వేగభరితం, గాఢం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: తనకూ ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య విభేదాలు పొడసూపాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోం మంత్రి కొట్టిపారేశారు. మోడీతో తన సంబంధం అత్యంత పవిత్రమూ ఉద్వేగభరితమైందని, గాఢమైందని ఆయన అన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా ఆ బంధం తెగిపోదని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రివర్గం మోడీ ప్రాధాన్యం చాలా సహజమైందని, అది రుద్దింది కాదని ఆయన అన్నారు. గత ఏడాదిన్నర కాలంలో తమ మధ్య అనుబంధం మరింత గాఢమైందని, తమ సంబంధంపై ఉహాగానాలు ప్రచారం చేస్తున్నవారికి తమ మధ్య గల బంధం గాఢత తెలియదని అన్నారు.
తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా తమ మధ్య బంధం బలహీనపడకుండా తాను చూసుకుంటానని ఆయన చెప్పారు. ప్రజా జీవితంలో తాను సాధించిన ప్రతిష్ట మాత్రమే తన పెట్టుబడి అని ఆయన అన్నారు. తాను మోడీతో బంధాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తెంచుకోబోనని చెప్పారు.
తాను ఎవరితోనైనా గాఢమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి వ్యక్తిగత నష్టం చేసే ఆలోచన చేయబోనని చెప్పారు. విభేదాలు పొడసూపాయనే అతి చిన్న కారణంగా తాను ఎవరికీ హాని తలపెట్టబోనని ఆయన చెప్పారు. అది తన రాజకీయం కాదని స్పష్టం చేశారు.