మైసూరు ప్యాలెస్ లో యువరాజు పట్టాభిషేకం
మైసూరు: మైసూరు ప్యాలెస్ ను పర్యాటకులు మూడు రోజుల పాటు చూసే అవకాశం లేదు. మైసూరు యువరాజు పట్టాభిషేకం జరుగుతున్నందు వలన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందు వలన మూడు రోజుల పాటు మైసూరు ప్యాలెస్ లో పర్యాటకులు సందర్శించడానికి ఎలాంటి అవకాశం లేదు.
మైసూరు యువరాజు యదువీర్ కృష్టదత్త చామరాజ ఒడయార్ కు ఈనెల (మే) 28వ తేదిన పట్టాభిషేకం చేస్తున్నారు. అందుకు ముహుర్తం నిర్ణయించారు. మైసూరు ప్యాలెస్ లోని కళ్యాణ మంటపంలో పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
యదువీర్ కృష్టదత్త చామరాజ ఒడయార్ కు పట్టాభిషేకం చేస్తున్నందు వలన ప్యాలెస్ ఆవరణంలో పర్యాటకులు సంచరించడానికి అవకాశం ఇవ్వరాదని రాణి ప్రమోదాదేవి ఒడయార్ మైసూరు జిల్లాధికారికి మనవి చేస్తూ లేఖ వ్రాశారు.
ఈ నెల 26వ తేది నుండి 28వ తేదీ వరకు మైసూరు ప్యాలెస్ లో పర్యాటకులు సంచరించడానికి అనుమతి ఇవ్వరాదని మైసూరు జిల్లాధికారి శిఖ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాధికారి ఆదేశాల మేరకు మంగళవారం నుండి మూడు రోజుల పాటు మైసూరు ప్యాలెస్ లో బయటవారు అడుగు పెట్టడానికి వీలు లేదని అధికారులు తెలిపారు.