సుక్మా ఎన్కౌంటర్-సీఆర్పీఎఫ్ జవాన్ కిడ్నాప్-విడిపించాలని మోడీకి భార్య విజ్ఞప్తి
శనివారం ఛత్తీస్ఘడ్లోని సుక్మా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 22 మందికి పైగా జవాన్లు మృత్యువాత పడ్డారు. వీరితో పాటు మరో సీఆర్పీఎప్ జవాన్ అదృశ్యమయ్యారు. కాల్పుల తర్వాత పలువురు జవాన్ల మృతదేహాలు లభించగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఇవాళ ఇద్దరు జర్నలిస్టులకు మావోయిస్టుల నుంచి కాల్స్ వచ్చాయి. అదృశ్యమైన జవాన్ తమ చేతుల్లో బందీగా ఉన్నాడని వారు తెలిపారు. దీంతో ఆ జవాన్ ఆచూకీపై ఉత్కంఠ పెరుగుతోంది.
సుక్మా, బీజపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అదృశ్యమైన జవాన్ తమ వద్ద భద్రంగా ఉన్నారని, ఆయన ప్రాణాలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ఇవాళ జర్నలిస్టులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివరాలను వారు పోలీసులకు అందించారు. శనివారం మాద్వీ హిద్మా నేతృత్వంలోని దాదాపు 600 మావోయిస్టులు, వారి సానుభూతిపరుల బృందం టారెమ్ అడవుల్లో కూంబింగ్ చేస్తున్న జవాన్లను చుట్టుముట్టి కాల్పులకు దిగింది. ఇందులో 22 మంది జవాన్లు చనిపోయారు. మావోయిస్టులు పట్టుకున్న జవాన్ను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామని జర్నలిస్టులకు చెప్పారు.
ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో అదృశ్యమైన సీఆర్పీఎఫ్ జవాన్ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆయన్ను కాపాడాలని భార్య ప్రధాని మోడీతో పాటు హోంమంత్ర అమిత్షాకూ ఇవాళ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు ఆయన్ను అపహరించినట్లు జర్నలిస్టులకు ఫోన్కాల్స్ చేసిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్ భార్య ప్రధాని, హోంమంత్రికి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అదృశ్యమైన సీఆర్పీఎప్ జవాన్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి.