నాగాలాండ్ రేపిస్ట్ వీడియో: ఇంటర్నెట్, మొబైల్ సర్వీసుల నిలిపివేత... 18మంది అరెస్ట్
కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రంలో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దిమాపూర్లో జరిగిన అత్యాచార నిందితుడి హత్యకు సంబంధ వీడియోలను దేశ వ్యాప్తంగా అడ్డుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి స్ధానిక పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది.
ఎంఎంఎస్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఆపాలని రాష్ట్రంలోని టెలికాం సంస్థలను ప్రభుత్వం ఆదేశించినట్లు స్థానిక పత్రికలు ప్రకటించాయి. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 18 మందిని అరెస్టు చేసినట్లు నాగాలాండ్ డీజీపీ వాబాంగ్ జమీర్ తెలిపారు.
ఇక దిమాపూర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144వ సెక్షన్ను విధించారు. 144వ సెక్షన్తో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 14 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్లు అదనపు డీజీపీ అకిటో సేమా తెలిపారు. నిందితుడిని హతమార్చిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం నాగాలాండ్ సీఎం జెలియాంగ్తో మాట్లాడిన విషయం తెలిసిందే. ఖాన్ను హతమార్చినవారిపై కఠనచర్యలు తీసుకోవాలన్నారు. దిమాపూర్ ముస్లిం మండలి సమక్షంలో ఫరీద్ ఖాన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దీనిని అసోంకు తరలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేసింది. ప్రజల చేతిలో కన్నుమూసిన సయ్యద ఫరీద్ ఖాన్ అసోంలోని కరీంగంజ్ జిల్లా బోస్లా గ్రామానికి చెందిన వాడు. నాగాలాండ్లోని దిమాపూర్ కేంద్ర కారాగారం నుంచి అత్యాచారం కేసులో ప్రజలు బయటకు లాక్కొచ్చి, చావబాది, హతమార్చిన విషయం తెలిసిందే.