ప్రచారం కోసం ముస్లీం టోపీలు, మోడీ బాధపడ్తున్నారు: నజ్మాహెఫ్తుల్లా
పాట్నా: చాలామంది రాజకీయ నాయకులు ముస్లీం టోపీలను పెట్టుకుంటారని, కానీ వాటిని గౌరవించరని, వారు ముస్లీంలతో తియ్యగా మాట్లాడుతారని, కానీ వాళ్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోరని కేంద్రమంత్రి నజ్మాహెఫ్తుల్లా గురువారం అన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ముస్లీం టోపీలను పెట్టుకుంటారని, నిజాయితీగా వ్యవహరించరని మండిపడ్డారు.
అందువల్లే బీహార్ రాష్ట్రంలో ఇంకా ముస్లీంలు వెనుకబడి ఉన్నారన్నారు. వారికి ఉపాధి, ఆహారం కావాలని, ముస్లీంలు తమ హక్కులను పొందడం లేదనే ప్రధాని నరేంద్ర మోడీ బాధపడుతున్నారన్నారు. ముస్లీం యువత ఓ చేత్తో ఖురాన్, మరో చేత్తో కంప్యూటర్ పట్టుకోవాలనేది ప్రధాని మోడీ ఆకాంక్ష అన్నారు. బీహార్లో వివిధ రాజకీయ పార్టీల నేతలు అనుసరించిన ముస్లింలను బుజ్జగించే విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు.

రాజకీయ నాయకులు ఇలా వ్యవహరించకుంటే బీహార్లో ముస్లింలు ఇంత వెనుకబడి ఉండేవారు కాదని ఆమె పేర్కొన్నారు. ఇక్కడి ముస్లింలకు టోపీల అవసరం లేదని, కావలసింది ఉద్యోగం, ఉపాధి, ఆహారం అన్నారు. తమను మరోసారి మోసం చేశారని గ్రహించిన ముస్లీంలు ఇప్పుడు ప్రధాని మోడీని అనుసరిస్తున్నారని, బీజేపీలో చేరుతున్నారన్నారు.
దేశంలోని ముస్లిం సున్నీ, షియా వక్ఫ్ బోర్డుల ఆస్తులను మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు ఆరు లక్షల ఎకరాలు ఉన్నాయని, సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఈ భూములను అభివృద్ధి చేస్తే సాలీనా ఎంత లేదన్నా రూ.20వేల కోట్ల నుంచి 25వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ నిధులను ముస్లింల సంక్షేమానికి వినియోగించవచ్చన్నారు.
ఇలా చేయాలంటే వక్ఫ్ బోర్డులను పునర్వ్యవస్థీకరించాలని, వాటి ఆస్తులను రిజిస్టర్ చేయాలన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకత కోసం ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాలన్నారు. ఈ చర్యలను కొంతమంది తప్పుబడుతున్నారని, అయితే ముస్లీంల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందనిచెప్పారు. దీని అమలు బాధ్యతను ప్రధాని మోడీ తనకు అప్పగించారన్నారు.












Click it and Unblock the Notifications