దక్షిణ బెంగళూరుపై టెక్కీ నీలేకని కన్ను, లోకసభకు?
న్యూఢిల్లీ: ఐటి నిపుణుడు, ఆధార్ చైర్మన్ నందన్ నీలేకని కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయట. కర్నాటకలోని దక్షిణ బెంగళూరు స్థానం నుండి పోటీ చేసేందుకు నీలేకని ఆసక్తి కనబరుస్తున్నారంట. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పరమేశ్వరన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
నీలేకని దక్షిణ బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారని, ఆ నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఈ విషయమై మాట్లాడుతామని పరమేశ్వరన్ చెప్పారు. నీలేకని వంటి వారు కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడం సంతోషించదగ్గ విషయమన్నారు.

నీలేకని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరగడం ఇది తొలిసారి కాదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నందన్ నీలేకనీ అనే ప్రచారం జరిగింది. ఇది వదంతని అప్పుడే కాంగ్రెసు పార్టీ కొట్టి పారేసింది. అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అది రాహుల్ గాంధీయా లేక మరొకరా అనేది అధిష్టానం త్వరలో నిర్ణయిస్తుందని కాంగ్రెసు పార్టీ అప్పుడు పేర్కొంది.
అంతకుముందు అనిల్ కుంబ్లే పైన నీలేకని కాంగ్రెసు పార్టీ తరపున దక్షిణ బెంగళూరు నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కుంబ్లే బిజెపి నుండి, నీలేకని కాంగ్రెసు తరఫున 2014 ఎన్నికల బరిలో దిగుతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ నుండి బిజెపి తరఫున అనంత కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గం హుబ్లీ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications