Nandigram exit poll 2021: మమతకు ఘోర పరాభవం తప్పదా: పార్టీ గెలిచినా: ఆమె ఓటమి తథ్యం?
కోల్కత: ఇటీవలే ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే నిలిచాయి. ప్రత్యేకించి- పశ్చిమ బెంగాల్పైనే అందరి ఫోకస్ ఉంది. మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా? లేక కమలనాథులు పాగా వేస్తారా? అనేది ఉత్కంఠతగా మారింది.
బీజేపీ పరిస్థితేంటీ?: అంచనాలన్నీ తలకిందులే:ఊరించి..ఉసూరుమనిపించినట్టే
తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్- పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్దే విజయమంటూ ఢంకా మోగిస్తున్నాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ మినహా.. దాదాపు అన్ని ప్రధాన మీడియా హౌస్లో నిర్వహించిన సర్వేలన్నీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ వైపే మొగ్గు చూపాయి. బొటాబొటి మెజారిటీతోనైనా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలితానివ్వలేదని అంచనా వేశాయి. బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగడం ఖాయమని. తన ఓటుబ్యాంకు, ఓట్ల శాతాన్ని బీజేపీ భారీగా పెంచుకోగలుగుతుందని తెలిపాయి.
పశ్చిమ బెంగాల్లో హాట్ సీట్గా మారిన అసెంబ్లీ నియోజకవర్గం- నందిగ్రామ్. స్టార్ వార్స్గా నిలిచిన స్థానం ఇది. మమతా బెనర్జీ పోటీ చేసిన నియోజకవర్గం కావడం ఒక ఎత్తయితే.. బీజేపీ తరఫున పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తన మంత్రివర్గ మాజీ సహచరుడు సువేందు అధికారిని ఢీ కొట్టడం మరో ఎత్తు. నిజానికి- ఈ స్థానం తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోట. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరఫున సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించారు. తృణమూల్లో నంబర్ టూగా ఎదిగారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు- ఆయన పార్టీని వీడారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే నందిగ్రామ్ నుంచీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సువేందు అధికారి- ఎన్నికల ముంగిట్లో తనకు వెన్నుపోటు పొడిచారని భావించిన మమతా బెనర్జీ ఏకంగా ఆయనపైనే పోటీకి దిగారు. సువేందు అధికారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వబోనని శపథం చేశారు మమతా. తనకు అచ్చొచ్చిన భవానీపురా స్థానాన్ని వదులుకుని మరీ.. నందిగ్రామ్లో తలపడ్డారు. సువేందుపై పోటీ చేశారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Recommended Video
నందిగ్రామ్ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం సువేందు అధికారి వైపు టర్న్ అయినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. సాక్షాత్తూ మమతా బెనర్జీనే పోటీకి దిగినప్పటికీ.. అక్కడి ఓటర్లు సువేందు అధికారికే ఓటు వేశారని అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీ ఓడిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని ఇండియా టీవీ-పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. మమతా బెనర్జీ ఓడిపోవడానికే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మమతా బెనర్జీ గెలిస్తే.. మెజారిటీ అంతంత మాత్రంగానే ఉంటుందని తెలిపింది.