సుశాంత్ సింగ్ డెత్ కేసులో డ్రగ్స్ కోణం: రియా ఇంటిపై: నార్కొటిక్స్ రెయిడ్: సోదా
ముంబై: దేశవ్యాప్తంగా ప్రకంపనలను రేపుతోన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ హైప్రొఫైల్ డెత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణించిన కేసులో ఇప్పటికే ఆయన స్నేహితురాలు నటి రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) టార్గెట్లోకి వచ్చారు. ముంబైలోని రియా చక్రవర్తి నివాసంపై నార్కొటిక్స్ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు.
Recommended Video
నార్కొటిక్స్ అధికారుల మెరుపుదాడి..
శుక్రవారం తెల్లవారు జామున 6:30 గంటలకు అయిదుమంది నార్కొటిక్స్ బ్యూరో అధికారులు మెరుపు దాడి చేశారు. ముంబైలోని జుహు తారా రోడ్డులో గల రియా చక్రవర్తి నివాసంతో పాటు సుశాంత్సింగ్ సన్నిహితుడు శామ్యుల్ మిరిండా నివాసంపై ఏకకాలంలో ఈ దాడులు ఆరంభం అయ్యాయి. సుశాంత్ సింగ్ డెత్ కేసులో కొత్తగా డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు రంగ ప్రవేశం చేశారు. రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు రియా చక్రవర్తి, శామ్యుల్ మిరిండా నివాసాల్లో తనిఖీలను కొనసాగిస్తున్నారు. డ్రగ్స్, దానికి సంబంధిత ఆధారాల కోసం సోదాలను చేపట్టారు.
డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ కోణం ఉందనే సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే నార్కొటిక్స్ బ్యురో అధికారులు బరిలో దిగారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉండ వచ్చనే కోణంలో వారి దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కైజన్ ఇబ్రహీం అనే డ్రగ్ ట్రాఫికర్ను అధికారులు అరెస్టు చేశారు. ఇబ్రహీంను అరెస్టు చేసిన మరుసటి రోజు తెల్లవారు జామునే వారు రియా చక్రవర్తి, శామ్యుల్ మిరిండా ఇళ్లపై దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించకుంది. ఇబ్రహీం ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకే అధికారులు ఈ మెరుపుదాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు.
డ్రగ్ డీలర్లు, ట్రాఫికర్ల అరెస్టు..
కైజన్ ఇబ్రహీంను అరెస్టు చేయడానికి ముందే ఎన్సీబీ అధికారులు డ్రగ్ డీలర్ అబ్దెల్ బాసిత్ పరిహార్, అంతకుముందు జైడ్ విలాట్రాను ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జైడ్ విలాట్రా నుంచి 9.55 లక్షల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ట్రాఫికర్లు అబ్బాస్ లఖాని, కరన్ అరోరా ఇదివరకే అరెస్టు అయ్యారు. బాసిత్ పరిహార్తో రియా చక్రవర్తికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నార్కొటిక్స్ అధికారులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కూడా చోటు చేసుకుందంటూ ప్రాథమికంగా నిర్దారించారు.
డ్రగ్ డీలర్తో రియా డైరెక్ట్ కాంటాక్ట్..
ఈ పరిణామాల మధ్య నార్కొటిక్స్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తి నివాసంపై దాడులు చేయడం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. రియా చక్రవర్తి, శామ్యుల్ మిరిండా నివాసాల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరుకుతాయనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ డీలర్తో రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ చేశారని ఇప్పటికే నిరూపితమైంది. డ్రగ్స్ మాఫియాకు బెంగళూరు, గోవా, ఢిల్లీతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. తాజాగా శాండల్వుడ్లో కలకలం రేపుతోన్న డ్రగ్స్తో ఈ ఘటనకు లింకులు లేకపోలేదని చెబుతున్నారు.