నరేంద్రమోడీ సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రయివేటు పరం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఖాళీగా ఉన్న రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వబోతోంది. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రయివేటు వ్యక్తులు రైల్వే స్థలాలను లీజుకు తీసుకునే వెసులుబాటు కలిగింది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముందుగా ఖాళీగా స్థలాలను లీజుకివ్వడంద్వారా ఆదాయం వస్తుందని చెబుతారని, క్రమేణా ప్రయివేటుకు తలుపులు బార్లా తెరుస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ వస్తోంది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వరంగ సంస్థను ధారాదత్తం చేసేస్తోంది. వీటిల్లో ఎక్కువగా అదానీ గ్రూపు పరమయ్యాయని, ప్రధానమొంత్రి మోడీ అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటున్నారంటూ కమ్యనిస్టు నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరమయ్యే చర్యల్లో భాగంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్రం అమ్మకానికి పెట్టగా ఉద్యోగులు, కార్మికులు ఏడాదికి పైబడి నిరసనలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రయివేటుపరం చేయడానికే కట్టుబడి ఉన్నామంటూ పార్లమెంటులో ప్రభుత్వం స్పష్టం చేసింది. దాన్ని ప్రయివేటు పరం చేసే వ్యూహంలో భాగంగానే లాభాల్లో ఉన్న సంస్థ ఉత్పత్తిని తగ్గించారని, ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడంతో లాభాలు రావడంలేదంటూ బయటివారికి కట్టబడెతారని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. తాజాగా రైల్వే స్థలాలను లీజుకివ్వడమనేది కూడా ఇదే వ్యూహమని, ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలంటూ కొన్ని రైల్వే సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.