నితీష్ మిత్రుడే కానీ, బీహార్కు ఘన చరిత్ర: నరేంద్రమోడీ
పాట్నా: బీహార్ రాష్ట్రానికి ఘన చరిత్ర ఉందని, ఇక్కడి నుండే మార్పు రావాలని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. పాట్నాలో జరిగిన హూంకార్ ర్యాలీలో మోడీ, బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు మంచి మిత్రుడని అయితే ప్రధానమంత్రి పదవి కోసం కాంగ్రెసు పార్టీతో చేతులు కలిపారని ఆరోపించారు. తాము త్యాగం చేసి నితీష్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే ఆయన తమనే కాకుండా బీహార్ ప్రజలను వంచించారని మండిపడ్డారు. జెడి(యు) మోసానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

జెడియు - బిజెపి పాలనలో బీహార్కు మేలు చేసింది కమలనాథులే తప్ప ఇంకెవరు కాదన్నారు. రాజకీయ చదరంగంలో నితీష్ కళంకితుడే అన్నారు. యూపిఏ ప్రభుత్వం 2004, 2009లలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెసును ఇంటికి పంపిస్తేనే దేశంలో అభివృద్ధి సాధ్యమన్నారు.
బీహార్కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. చంద్రగుప్త మౌర్యుడి రాజనీతి తనకు ఆదర్శమన్నారు. గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి వారికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఈ రాష్ట్రమన్నారు. జయప్రకాశ్ నారాయణ హయాంలో తాను లేనందుకు చింతిస్తున్నానని అయితే, ఆయన ప్రవచనాలను తాను పాటిస్తున్నానన్నారు.
బీహార్లో అతికొద్ది మంది మినహా ఎవరూ అవకాశవాదులు కాదన్నారు. బీహార్ను ఆటవిక పాలన నుండి కాపాడటమే లక్ష్యంగా బిజెపి పని చేసిందని, చేస్తోందన్నారు. యాదవుల సంక్షేమం బాధ్యతను తాను తీసుకుంటానని మోడీ హామీ ఇచ్చారు. బీహార్ వచ్చే ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తే మార్పు సాధ్యమన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో దండి, సత్యాగ్రహ ఉద్యమాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి మార్పు బీహార్ ప్రజలు తీసుకు రావాలన్నారు.
బీహార్ పరివర్తన ఉద్యమాలకు పురిటి గడ్డ అన్నారు. దేశ ప్రజలు శక్తిమంతులు కావాలన్నారు. ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తనను తిట్టే ఏ అవకాశాన్ని వదులుకోరన్నారు. మూడు నెలల క్రితం లాలూకు ప్రమాదం జరిగినప్పుడు తాను ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగానని గుర్తు చేశారు. ఈ విషయాన్ని లాలూయే స్వయంగా చెప్పారన్నారు. కాంగ్రెసు వారసత్వ రాజకీయాలకు చెక్ చెబితే రాహుల్ గాంధీని రాజకుమారుడు అని పిలవడం మానేస్తానని చెప్పారు.
కాంగ్రెసుకు పేదరికం అంటే ఏమిటో తెలియదన్నారు. వంద రోజుల్లో ధరల పెరుగుదలను నియంత్రిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు పదేళ్లైనా ఏం చేయలేదన్నారు. గుజరాత్లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోటా నాలుగువేలకు పైగా ఉంటే నలభై వేల దరఖాస్తులు వస్తాయని, బీహార్లో ఏడున్నర వేలున్నా అవి పూర్తిగా నిండవని ఎద్దేవా చేశారు. తన దృష్టిలో దేశానికే తొలి ప్రాధాన్యత అన్నారు. కాగా, మోడీ తన సభను వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో ముగించారు.












Click it and Unblock the Notifications