కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్డౌన్?
అగ్రరాజ్యం అమెరికాను సైతం వెనక్కు నెట్టేసి, రోజువారీ కొత్త కేసుల్లో రికార్డు సాధించడమేకాకుండా, ప్రతిరోజూ వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోతూ, చికిత్స పొందుతోన్న రోగులకు ఆక్సిజన్ అందక, లక్షల మందికి బెడ్లు దొరక్క ఇక్కట్లు, భారీగా పెంచిన దరలకు వ్యాక్సిన్లను అమ్మజూస్తోన్న వైనం, ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోన్న మోదీ సర్కారు తీరును న్యాయస్థానాలు తప్పుపడుతున్నాయి. దొంగతనం చేసైనా సరే కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందజేయాల్సిందేనని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు తలంటగా, ఇప్పుడు సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసి, దేశంలో ప్రస్తుత పరిస్థితిని 'జాతీయ ఎమర్జెన్సీ'గా అభివర్ణించింది.
Recommended Video

దేశంలో అల్లకల్లోలం..
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3.14లక్షల కొత్త కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి. పరిస్థితి రోజురోజుకూ జఠిలంగా మారుతోన్న నేపథ్యంలో కరోనా నియంత్రణ, నిర్వమణ అంశాలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు గురువారం జరిపిన విచారణలో సంచలన కామెంట్లు చేసింది. ''దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది'' అని ఆందోళన వ్యక్తం చేసింది.

కోర్టుల్లో గందరగోళం వద్దని మేమే..
వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై సుప్రీం ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడున్న పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని చీఫ్ జస్టిస్ బోబ్డే అన్నారు. కొవిడ్ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయని, అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక జాతీయ ప్రణాళిక అవసమమన్న ధర్మాసనం దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కేంద్రానికి నోటీసులు.. 4అంశాలు
''దేశంలో ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరించాం. కరోనా నియంత్రణకు సంబంధించిన ఈ నాలుగు అంశాలపై కేంద్రానికి నోటీసులు ఇస్తున్నాం. రేపటి(శుక్రవారం)లోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తున్నాం. ఈ అంశంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్ హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా నియమిస్తున్నాం'' అని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ఉండదని కేంద్రం తొలి నుంచీ చెబుతున్నప్పటికీ, పరిస్థితి తీవ్రత, సుప్రీంకోర్టు ఆగ్రహం దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications