నేషనల్ హెరాల్డ్ కేసు: 3 రోజులపాటు 30 గంటలు రాహుల్ను విచారించిన ఈడీ, మళ్లీ సమన్లు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుసగా మూడోరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగింది. బుధవారం దాదాపు 9 గంటలపాటు రాహుల్ గాంధీని విచారించారు ఈడీ అధికారులు. అయితే, మళ్లీ శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
కాగా, ఈ మూడు రోజుల వ్యవధిలో దాదాపు 30 గంటలపాటు రాహుల్ ను ఈడీ విచారించింది. రాహుల్ పై అనేక ప్రశ్నలు సంధించడం ద్వారా ఈ కేసులో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నేటి విచారణలో భాగంగా బుధవారం ఉదయం 11.35 గంటలకు రాహుల్.. ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మూడు గంటలపాటు విచారించి ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో రాహుల్ బయటికి వెళ్లారు.
ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈడీ అడిగిన ప్రశ్నలలో 80 ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీ పదే పదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడంతో విచారణ ఆలస్యమైందని ఈడీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీని ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను కొనసాగిస్తోంది.
ఈ కేసు విషయానికొస్తే.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2013లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే విచారణ కొనసాగుతోంది.