రాజస్ధాన్ లో విద్యార్దినుల స్లీవ్స్ కట్ చేసి పరీక్షా కేంద్రాల్లోకి-జాతీయ మహిళా కమిషన్ ఫైర్-సుమోటో కేసు
రాజస్దాన్ లోని బికనీర్ లో తాజాగా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధినుల స్లీవ్స్ కత్తిరించి అనుమతించడంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
రాజస్థాన్లోని బికనీర్లోని పరీక్షా కేంద్రం బయట ఓ మహిళా అభ్యర్థి ధరించిన టాప్ స్లీవ్లను మగ గార్డు కత్తిరించిన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇది మహిళల్ని అవమానించే చర్య అని అభిప్రాయపడింది. యఇలాంటి వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష కేంద్రంలో మహిళా అభ్యర్థులను శోధించడానికి మహిళా గార్డులను ఎందుకు నియమించలేదని జాతీయ మహిళా కమిషన్ (NCW) వివరణ కోరింది.
ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది. మహిళలను ఇలాంటి వేధింపులకు గురిచేయడం చాలా అవమానకరం, సిగ్గుమాలిన సంఘటన అని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. కమిషన్ ఈ విషయంలో సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ సీఎస్ కు రాసిన లేఖలో మహిళా కమిషన్ కోరింది. అలాగే అక్కడ మహిళా గార్డు స్ధానంలో పురుష గార్డును ఎందుకు ఉంచాల్సి వచ్చిందో కూడా వివరణ ఇవ్వాలని కమిషన్ సూచించింది.