బీజేపీతో తెగదెంపులు..ఎన్డీఏ నుంచి బయటికి: శివసేనకు ఎన్సీపీ షరతులు..!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో.. సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లపై ఆధార పడింది. ప్రత్యేకించి ఎన్సీపీ. ఎన్సీపీతో దోస్తీ కట్టాలీ అంటే ఆ పార్టీ విధించే షరతులకు శివసేన తల ఊపాల్సిన పరిస్థఇతి ఏర్పడింది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి శివసేన బయటికి రావాల్సి ఉంటుందని, బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు లిఖితపూరకంగా హామీ ఇవ్వాలని చెబుతోంది.

తెగదెంపులకు శివసేన సై..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావాలే గానీ దేనికైనా తెగించేటట్లు కనిపిస్తోంది శివసేన దూకుడు చూస్తోంటే. ప్రత్యేకించి బీజేపీతో. బీజేపీ-శివసేన మధ్య ప్రస్తుతం టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేయడం, ఆ వెంటనే గవర్నర్ శివసేనకు ఆహ్వానాన్ని పంపడంతో సరికొత్త రాజకీయ సమీకరణాలకు బాటలు వేసినట్టయింది. 30 సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఇక ఎన్సీపీతో జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఎన్సీపీ సహకారంతో మహారాష్ట్ర పీఠాన్ని అందుకోవడానికి సన్నద్ధం కావచ్చని చెబుతున్నారు.

ఎన్డీఏ నుంచి బయటికి రావడం అంటే..
ప్రస్తుతం శివసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. శివసేన నాయకులు కేంద్రమంత్రులుగా కొనసాగుతున్నారు. వారందరూ తమ పదవులకు రాజీనామాలను చేయాల్సి ఉంటుందని ఎన్సీపీ షరతులు పెట్టినట్లు సమాచారం. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాపై కనీసం చర్చ అనేది కూడా లేకుండా తోసిపుచ్చడం శివసేనకు ఆగ్రహాన్ని కలిగించింది. ఇన్నేళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని కనీసం రెండున్నరేళ్ల పాటైనా కేటాయించక పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల మధ్య ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం.

ఎల్లుండి ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారి శివసేనకు ఆహ్వానం పంపిన అనంతరం నెలకొన్న తాజా రాజకీయ స్థితిగతులను ఎన్సీపీ ఓ కంట కనిపెడుతూనే వస్తోంది. దీనిపై ఇప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించడానికి సిద్ధంగా లేదు ఎన్సీపీ అగ్ర నాయకత్వం. మంగళవారం ఎన్సీపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఎన్సీపీ అధినేత, కేంద్రమాజీ మంత్రి శరద్ పవార్ దీనికి హాజరు కానున్నారు. శివసేనకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని ఈ సమావేశంలోనే నిర్ణయిస్తామని ఎన్సీపీ సీనియర్ నాయకుడు నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. తాము విధించే షరతులకు శివసేన అంగీకరించాల్సి ఉంటుందని తేటతెల్లం చేశారు.












Click it and Unblock the Notifications