ముంబై నడిబొడ్డున అతి పెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీ.. దావూద్ ఇబ్రహీంతో లింక్; అంతర్జాతీయంగా సప్లై
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే డ్రగ్స్ మాఫియా పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముంబై నగరం నడిబొడ్డున అతి పెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీ పై రైడ్ చేసి నమ్మలేని అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. దక్షిణ ముంబై నగరం నడిబొడ్డున మెఫెడ్రోన్ తయారీ చేస్తున్న ఫ్యాక్టరీ పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా, భారీగా ఆయుధాలను, కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుంది. ముంబై మహానగరాన్ని మత్తులో ముంచుతున్న అతి పెద్ద డ్రగ్స్ సామ్రాజ్యాన్ని వెలుగులోకి తెచ్చింది ఎన్సీబీ .

ఎన్సీబీ దాడులు మెఫెడ్రోన్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు, భారీగా ఆయుధాలు , నగదు స్వాధీనం
బుధవారం ఉదయం నుండి చేస్తున్నదాడులు, ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేస్తున్న ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున మెఫెడ్రోన్ తయారీకి ఉపయోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. భారీగా తుపాకులను, నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. దావూద్ ఇబ్రహీం కు బలమైన కోటగా ఉన్న దక్షిణ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఈ కర్మాగారాన్ని గ్యాంగ్ స్టర్ , డ్రగ్ లార్డ్ చింకు పఠాన్ అలియాస్ పర్వేజ్ ఖాన్ అనుచరుడు నిర్వహిస్తున్నారు.

ముంబైలోని డ్రగ్స్ ఫ్యాక్టరీకి అంతర్జాతీయంగా ఖాతాదారులు .. దావూద్ ఇబ్రహీం తో లింక్
దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు , ముఠా సభ్యులు ఇప్పటికి ఈ ప్రదేశం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గా సమాచారం.
ముంబైలోని డ్రగ్స్ మాఫియా లో, ముఖ్యమైన నాయకుడు పఠాన్ ఒకడని, దావూద్ ఇబ్రహీం ముఠాతో కూడా ఇతనికి సంబంధం ఉందని తెలుస్తుంది. ముంబై మరియు ఎంఎంఆర్ ప్రాంతంలో 70% మెఫెడ్రోన్ సరఫరాను పఠాన్ నిర్వహిస్తున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది.
పఠాన్ తన గ్యాంగ్ తో నిర్వహిస్తున్న ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీకి అంతర్జాతీయంగా ఖాతాదారులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇంతపెద్ద డ్రగ్స్ కర్మాగారాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి : ఎన్సీబీ వెల్లడి
ముంబై నడిబొడ్డున ఇంతపెద్ద డ్రగ్స్ కర్మాగారాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి అని ఎన్సిబి వర్గాలు తెలిపాయి .
చింకు పఠాన్ మాజీ అండర్ వరల్డ్ డాన్, దివంగత కరీం లాలా యొక్క బంధువు. అతను దావూద్ ఇబ్రహీం ముఠాకు కూడా సన్నిహితుడు. పఠాన్ డ్రగ్స్ తయారీ కోసం కిచెన్ ప్రయోగశాలలను నడుపుతున్నాడు. మెఫెడ్రోన్ ను తయారుచేసి దానిని ముంబై నగరంలోనూ డ్రగ్ పెడలర్స్ ద్వారా ఇతర ప్రాంతాల లోనూ, అంతర్జాతీయంగానూ రవాణా చేస్తున్నాడు. ముంబైలోని యువతను , విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్నాడు .
Recommended Video

డ్రగ్ లార్డ్ చింకు పఠాన్ అలియాస్ పర్వేజ్ ఖాన్ కోసం మొదలైన వేట
ఎన్సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆధ్వర్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రైడ్ చేశారు. పఠాన్ తన గ్యాంగ్ తో ఈ కర్మాగారాన్ని నడుపుతున్న దక్షిణ ముంబైలో దాడులు నిర్వహించి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు . డ్రగ్స్ మాఫియా విస్తరించిన సామ్రాజ్యాన్ని చూసి షాక్ తిన్నారు. 38 ఏళ్ల చింకు పఠాన్ను డ్రగ్స్ పెడ్లర్ జునైద్ షేక్ సరఫరాదారు. గత నెలలో పైథోనీ పోలీసులు మెఫెడ్రోన్తో జునైద్ షేక్ ను అరెస్ట్ చేశారు . అప్పటి నుండి, పర్వేజ్ ఖాన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతనిని అరెస్టు చేయడం వల్ల ముంబై మహానగరంలో చాలామంది డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంటుందని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications