రికార్డేమిటో మోడీకి చెప్పండి: పవార్, మండిపడ్డ సేన
ముంబై: తన ఎన్నికల రికార్డేమిటో ఎవరైనా ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పాలని ఎన్సీపి అధినేత శరద్ పవార్ అన్నారు. తాను ఇప్పటి వరకు 14 ఎన్నికల్లో పోరాడానని, ఈ ఎన్నికలకు తాను భయపడతానా? అని ఆయన ప్రశ్నించారు.
యూపిఏ నౌక మునిగిపోతుందని తెలియడం వల్ల పవార్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ మార్గాన్ని ఎంచుకున్నారని మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో మోడీ తనపై చేసిన విమర్శలను సోమవారం ఆయన తోసిపుచ్చారు.
అభిమానం అప్పుడేమైంది?: మోడీకి సేన ప్రశ్న
శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న గౌరవాన్ని తాము స్వాగతిస్తున్నామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. అయితే పొత్తులు తోసిరాజని ఎత్తుగడలు నెరిపిన నాడు ఆ ఆదరాభిమానాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
వ్యాపారుల, స్వప్రయోజనాల కోసం 25ఏళ్ల పొత్తును విచ్ఛిన్నం చేశారని సోమవారం శివసేన పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా' సంపాదకీయంలో ఆరోపించారు. శివసేన-భారతీయ జనతా పార్టీల కూటమి కొనసాగి ఉంటే బాల్ థాక్రేకి నిజమైన నివాళి అయి ఉండేదనీ అన్నారు. మోడీ నేతృత్వంలోని బిజెపి తమను వెన్నుపోటు పొడిచిందని అన్నారు.