వాళ్లు కాకపోతే మేమున్నాం : ఎన్సీపీ
మహారాష్ట్రలో సీఎం పీటముడి రోజు రోజు బిగుసుకుంటుంది. శివసేన ఎలాగైన సీఎం సీటును దక్కించుకోవాలని భావిస్తున్న తరుణంలో సిద్దాంతాలను పక్కన పెట్టి సీఎం సీటే లక్ష్యంగా ఆపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రకటించిన ఎన్సీపీ నేతలో మంతనాలు జరిపారు. శివసేన మరియు ఎన్సీపీల అగ్రనేతలు ఫోన్లో నేరుగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. గురువారం కూడ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడ శరద్ పవార్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. శివసేన ,బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ఇతర దారులు కూడ ఉన్నాయని ఎన్సీపీ కీలక వ్యాఖ్యలు చేసింది.
బీజేపీ ,శివసేనల మధ్య 50:50 ప్రతిపాదన విఫలమైన తర్వాత ఇరుపార్టీల నేతలు సీఎంపై పట్టువిడుపులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు సిద్దాంతాల పరంగా ఒకే విధానాలు కల్గిఉన్న బీజేపీ, శివసేనలు కలిసి ఎన్ని విభేదాలు ఉన్నా అధికారాన్ని పంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రాజకీయా విశ్లేషకులు భావించారు. అయితే ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి సీటు హాట్ టాపిక్గా మారింది. దాని కోసం ఇరు పార్టీలు తమ పార్టీ సిద్దాంతాలను పక్కన పట్టి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సీఎం పదవిని చేపట్టేందుకు ఓవైపు బీజేపీ ముమ్మర ప్రయత్నాల్లో ఉండగా ఆపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తిరిగి ఫడ్నవీస్ పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతుంది.
అయితే శివసేన సైతం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో శివసేనకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీకి తిరిగి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ,ఎన్సీపీల కూటమి శివసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన పెడతారనే ప్రచారం నేపథ్యంలోనే మిగతా పార్టీలు తెరమీదకు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇరు పార్టీల రాజకీయంగా భావించిన ఎన్సీపీ, కాంగ్రెస్లు అధికారానికి బీజేపీని దూరం చేసేందుకు పావులు కదుపుతున్నాయి.