To day in Parliament : సభ ముందుకు నార్కోటిక్ డ్రగ్స్ బిల్లు- రాజ్యసభ విపక్ష నేతల సమావేశం..!!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు సభ ముందు రెండు కీలక బిల్లులను ప్రతిపాదించనుంది. అదే విధంగా.. రాజ్యసభలో 12 మంది సభ్యుల సస్పెన్షన్ అంశం పైన విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ఈ రోజు లోక్ సభలో ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. తొమ్మది మంది మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పేపర్లను సభ ముందుకు తీసుకురానున్నారు. కార్మిక - చేనేత-స్కిల్ డెవలప్ మెంట్ పైన స్టాండింగ్ కమిటీల నివేదికలను ఈ రోజు సభలో ప్రవేశ పెట్టనున్నారు.
హౌసింగ్ తో పాటుగా అర్బన్ వ్యవహారాల పైన నివేదిక ఈ రోజు సభ ముందుకు రానుంది. ఎస్సీ- ఎస్టీ సంక్షేమం పైన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సైతం సభకు సమర్పించనున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన శాఖలకు సంబంధించిన అంశాల పైన స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు. ఇక, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టన్సస్ (NDPS) చట్ట సవరణ బిల్లు -2021 ను సభలో ప్రతిపాదించనున్నారు. అదే సమయంలో ఆమోదం కోసం సభను మంత్రి కోరనున్నారు.

ఈ నెల 8వ తేదీన డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రతిపాదించిన చర్చ పైన ఈ రోజు సభలో స్వల్పకాలిక చర్చ సాగనుంది. ఇక, రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ అంశం పైన ప్రతిపక్షాలు మరోసారి పట్టుబట్టే అవకాశం ఉంది. వారి పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్ష నేతలు ఛైర్మన్ ను కోరుతున్నారు. అయినా, ఛైర్మన్ మాత్రం క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఎత్తివేస్తామని స్పష్టం చేసారు. కానీ, సభ్యులు మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతో..ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇక, సభలో దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ గురించి ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications