NEET Leak: నీట్ 2025 కూడా లీక్ ? ఈసారి చేసిన వాళ్లే..! సీబీఐ దర్యాప్తులో..!
వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష (NEET UG 2026) ప్రశ్నాపత్రం లీక్ కావడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విధిలేని పరిస్ధితుల్లో దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే రాజస్థాన్ లోని సికార్ లో జరిగిన ఈ పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు చేపట్టడంతో పలు షాకింగ్ అంశాలు వెలుగుచూస్తున్నాయి. వీటిలో ఇప్పుడు నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసిన వారే గత ఏడాది నీట్ ( NEET 2025) పేపర్ కూడా లీక్ చేసినట్లు నిర్ధారణ అవుతోంది.
ఈ ఏడాది నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదంలో రాజస్థాన్కు చెందిన ఒక కుటుంబం కేంద్రంగా నిలిచింది. ఈ కుటుంబం గత సంవత్సరాల్లోనూ మెడికల్ ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసి అమ్ముకున్నారని పోలీసు వర్గాలు ఇండియా టుడేకి వెల్లడించాయి. రాజస్థాన్ పోలీసుల కథనం ప్రకారం, మంగి లాల్, దినేష్ బివాల్ సోదరులు ఈ సంవత్సరం సికార్లోని కోచింగ్ సంస్థలకు పేపర్ లీక్ చేశారు. గతంలోనూ ఇలాంటి పరీక్షల పేపర్లను సేకరించి, ఇతరులకు విక్రయించిన ఆరోపణలున్నాయి. జైపూర్ జిల్లాలోని జాంవా రామ్గఢ్కు చెందిన ఈ సోదరులను మొదట రాజస్థాన్ పోలీసులు, ఆపై సీబీఐ అరెస్టు చేసింది. సికార్ ద్వారా దేశమంతా విస్తరించిన పేపర్ లీక్ నెట్వర్క్లో వీరు కీలక లింక్ గా తేలారు.

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో, ప్రభుత్వం కొత్త పరీక్ష తేదీలను ప్రకటించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. కమాండ్ చైన్లో ఉల్లంఘన జరిగిందని, బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ అంగీకరించారు. బివాల్ కుటుంబంలోని ఐదుగురు పిల్లలకు నీట్ 2025 ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే చేరినట్లు రాజస్థాన్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన సూత్రధారి మంగిలాల్ కుమారుడు వికాస్ బివాల్ పై లీకైన పేపర్ను విక్రయించిన ఆరోపణలున్నాయి. ఈ పేపర్ను సేకరించి పంపిణీ చేయడానికి 65 లక్షల రూపాయలు చెల్లించారు. సికార్లో చదువుతున్న హర్యానాకు చెందిన యష్ యాదవ్, అక్కడే మంగిలాల్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ప్రశ్నాపత్రాలు మహారాష్ట్రకు చెందిన నెట్వర్క్ ద్వారా సేకరించినట్లు తేలింది. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న పెద్ద "ఫార్వర్డ్-టు-ఫార్వర్డ్" పంపిణీ చైన్ పై దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి.

ఈ మొత్తం రాకెట్ను కోచింగ్ మాఫియానే నిర్వహించిందని దర్యాప్తు ఏజెన్సీలు విశ్వసిస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారు ఈ పెద్ద నెట్వర్క్లో భాగం మాత్రమే. సికార్లోని కోచింగ్ సంస్థలపైనా విచారణ జరుగుతోంది. నీట్ 2026 పేపర్ లీక్ కేసు సాధారణమైనది కాదని, ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత సమాంతర నెట్వర్క్లో భాగమని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు అధికారుల ప్రకారం, నెట్వర్క్లోని ఒక సభ్యుడు తమ పాత్ర నుండి తప్పుకోవడం, సికార్ కోచింగ్ సెంటర్ల మధ్య తీవ్ర పోటీల కారణంగానే ఈ ఏడాది ఈ రాకెట్ బయటపడింది. లేకపోతే, గత సంవత్సరాల్లో లాగే ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు. దినేష్ కుమారుడు ఋషి పేపర్లను పంపిణీ చేసిన తర్వాతే లీక్ బయటపడినట్లు ఆరోపణలున్నాయి. సికార్లోని "కోచింగ్ వార్" నేపథ్యంలో, ఒక ప్రత్యర్థి కోచింగ్ సంస్థ, పీజీ వసతి ఆపరేటర్తో కలిసి ఈ అక్రమాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నివేదించ అప్రమత్తం చేశాయి.















Click it and Unblock the Notifications