నీట్ పీజీ అడ్మిషన్లలో కీలక పరిణామం: ఆ తేదీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వినిపించిన రెండో రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పీజీ అడ్మిషన్లలో రిజర్వేషన్ల కోటాలను సుప్రీంకోర్టు ఇటీవలే ఖరారు చేసింది. శుక్రవారమే దీనిపై తుది తీర్పు ఇచ్చింది. ఈ పీజీ అడ్మిషన్లలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి ఎంత శాతం మేర రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంపై తన తుది నిర్ణయాన్ని ఇచ్చింది.
ప్రధాని మోడీ కీలక ప్రకటన: ఇక ప్రతి డిసెంబర్ 26వ తేదీన..
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇదే..
నీట్ పీజీ కౌన్సెలింగ్లో అఖిల భారత కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను కల్పించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 శాతం మేర సీట్లను రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువడించింది. నీట్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారి అర్హతను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ధారించిన విషయం తెలిసిందే.
రూ.8 లక్షల వార్షికాదాయం ప్రాతిపదిక..
ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ధారించడానికి ఎనిమిది లక్షల రూపాయల వార్షికాదాయాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఎనిమిది లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాల వారిని ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వారిగా గుర్తించి, రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది. కేంద్రం నుంచి అఫిడవిట్ అందిన నేపథ్యంలో- దీనిపై దాఖలైన పిటీషన్పై విచారణను వేగవంతం చేయాలని, అత్యవసరంగా వాదనలను చేపట్టాలని కేంద్రం కోరింది.
ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు కోటా నిర్ధారణ..
2021-2022 విద్యాసంవత్సరంలో నీట్ పీజీ అడ్మిషన్లలో అఖిల భారత కోటాలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) వారికి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతాన్ని కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల (ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డిప్లొమా/బీడీఎస్/ఎండీఎస్) అడ్మిషన్లకు ఈ రిజర్వేషన్ కోటాను వర్తింపజేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాపై రిజర్వేషన్లను కల్పించడంపై సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
తీర్పు వెలువడిన రెండోరోజే..
సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన రెండో రోజే- కేంద్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ అంటే బుధవారం నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. అఖిల భారత కోటాలో ఖరారు చేసిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాల ఆధారంగా కౌన్సెలింగ్ చేపడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
కోవిడ్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో..నీట్ పీజీ అడ్మిషన్లను చేపడుతున్నామని, దీనివల్ల వైద్య ఆరోగ్య రంగం మరింత బలోపేతమౌతుందని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పూర్తి చేసిందని చెప్పారు. వైద్య విద్యలో చేరబోయే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని మంత్రి పేర్కొన్నారు. పేదలకు వైద్యాన్ని అందించడానికి యువ డాక్టర్లు శ్రమించాలని కోరారు.