దెబ్బకు దెబ్బ: పెప్సీ, కోకాకోలాకు నీళ్లు కట్, చేతులు ఎత్తేసిన తమిళనాడు!
చెన్నై: ప్రముఖ శీతలపానీయాలు పెప్సీ, కోకాకోలా కంపెనీలకు తమిళనాడు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలతో సహ మొత్తం 25 కంపెనీల కు నీరు సరఫరా చెయ్యలేమని తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కరుణాకరన్ స్పష్టం చేశారు.
దెబ్బకు దిగింది: పెప్సీ, కోకాకోలా బ్యాన్: వీటికి భలే గిరాకీ వచ్చేసింది
పెప్సీ, కోకాకోలా తదితర కంపెనీలకు నీరు సరఫరా చేస్తే తిరునల్వేలి, తుత్తకుడి జిల్లా ప్రజలు తాగునీరు కోసం ఆర్తనాదాలు చేసే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా కలెక్టటర్ కరుణాకరన్ అంటున్నారు. శీతలపానీయల కంపెనీలకు ఎందుకు నీరు సరఫరా చెయ్యలేకపోతున్నామో అనే విషయంపై ఆయన వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
50 రోజులకు మాత్రమే తాగు నీరు ఉంది
తిరునల్వేలి కార్పొరేషన్ కు సమీపంలోని సిఫ్ కాట్ ప్రాంతంలో పెప్సీ, కోకాకోలాతో సహ మొత్తం 25 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు తామరిబరణి నది నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తామరిబరణి నదిలో నీటి మట్టం తగ్గిపోయిందని, రెండు జిల్లాల ప్రజలకు కేవలం 50 రోజులు తాగునీరు సరఫరా చెయ్యడానికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కరుణాకరన్ అంటున్నారు.
నీళ్లు ప్రజలకు ఇవ్వాలా, కంపెనీలకా ?
తామరిబరణి నది నుంచి ప్రతి రోజు కోకాకోలా, పెప్సీ తదితర 25 కంపెనీలకు 48.66 లక్షల లీటర్ల నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు నదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఆ కంపెనీలకు నీళ్లు సరఫరా చెయ్యలేమని జిల్లా కలెక్టర్ కరుణాకరన్ తేల్చి చెప్పారు.
మదురై డివిజన్ బెంచ్
పెప్సీ, కోకాకోలా కంపెనీలకు నీరు సరఫరా చెయ్యరాదని గత ఏడాది న్యాయవాది లజపతిరాయ్ మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన మదురై కోర్టు న్యాయమూర్తులు వేలుమురుగన్, శివనానమ్ ఆ రెండు కంపెనీలకే ఎందుకు నీరు సరఫరా చెయ్యరాదని పిటిషనర్ ను ప్రశ్నించారు. తాగు నీటి సమస్య వస్తుందని తాను పిటిషన్ వేశానని, మీకు అభ్యతంరం ఉంటే ఆ ప్రాంతంలోని 25 కంపెనీలకు నీరు సరఫరా నిలిపివేయాలని లజపతిరాయ్ న్యాయస్థానంలో మనవి చేశారు.
కోర్టు చెప్పినా కష్టం అయ్యింది
ఈ విషయంపై వివరణ ఇవ్వాలని పీడబ్ల్యూడీ శాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కోర్టు ముందు హాజరై నదిలో నీటి మట్టం తక్కువగా ఉందని, అందుకే నీరు సరఫరా చెయ్యడానికి కష్టం అయ్యిందని వివరించారు.పెప్సీ, కోకాకోలా తో సహ అన్ని కంపెనీలకు నీరు సరఫరా చెయ్యాలని మదురై ధర్మాసనం 2016 నంబర్ లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నీటి మట్టం తగ్గిపోయిందని
కోర్టు ఆదేశాలు వచ్చినా తామరిబరణి నదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో తాము ఇప్పటి వరకు ఆ కంపెనీలకు నీరు సరఫరా చెయ్యలేదని కలెక్టర్ కురుణాకరన్ అంటున్నారు. 2017 ఏప్రిల్ 30వ తేదీ వరకు తాము తాగు నీటికి తప్పా ఇతర అవసరాలకు తామరిబరణి నదీ నీటిని ఉపయోగించమని అంటున్నారు.
సినిమా చూస్తున్న పెప్సీ, కోకాకోలా కంపెనీలు
తామరిబరణి నీటిని సరఫరా చేసే విషయంపై దాఖలు అయిన పిటిషన్ ఈనెల 27వ తేది మళ్లీ విచారణకు రానుంది. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు తాము ఏ కంపెనీకి నీళ్లు సరఫరా చెయ్యమని, తరువాత నీటి మట్టం పెరిగితే మళ్లీ పరిశీలిస్తామని తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కరుణాకరన్ అంటున్నారు.
మంచిపని చేశారంటున్న తమిళ ప్రజలు
జల్లికట్టును వ్యతిరేకిస్తున్న పెటా సంస్థ ప్రతినిధులకు ఆర్థికంగా ఆదుకుంటున్న విదేశీ శీతలపానీయాలైన కోకాకోలా, పెప్సీల విక్రయాలను ఇప్పటికే తమిళనాడులో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీలకు నీరు సరఫరా చెయ్యకుండా మంచి నిర్ణయం తీసుకున్నారని తమిళ సంఘాలు అంటున్నాయి.