ప్రీతి జింతా ఆరోపణలు: నోరు విప్పిన నెస్ వాడియా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతి జింతా తనపై చేస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు పారిశ్రామికవేత్త నెస్ వాడియా ప్రతిస్పందించారు. కేసులో 9 మంది సాక్షుల పేర్లను తెలియజేస్తూ ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్కు బుధవారంనాడు ఆయన ఓ లేఖ రాశారు.
ప్రీతి జింతా ఆరోపణలన్నీ అబద్ధాలని ఆయన ఆ లేఖలో అన్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ వద్ద ఉన్న వ్యక్తుల పేర్లను ఇస్తున్నానని, వారు స్వేచ్ఛగా నిజాలను వెల్లడించగరలని నమ్ముతున్నానని ఆయన అన్నారు.
ప్రీతి జింతా ఆరోపణలపై గత నెల ఆయన రెండు లైన్ల పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత ఇంత వివరంగా పోలీసులకు లేఖ రాయడం ఇదే మొదటిసారి. వాడియాపై ప్రీతి జింతా జూన్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వైపు నుంచి సాక్షుల పేర్లను ప్రీతి జింతా ఇది వరకే పోలీసులకు ఇచ్చారు. వారిలో అర డజను మంది వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. గత వారం జింతా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు.